25, జులై 2021, ఆదివారం

Bhangarh Fort: ఆ కోటలోకి వెళ్తే, అంతే సంగతులా? రత్నవతిని ప్రేమించిన మంత్రగాడెవరు? దెయ్యాల కోట!

 

భాన్‌గఢ్‌ కోట (Image credit - Wikipedia)

ఏ రాజుల కోటకైనా వెళ్తే... అక్కడి చారిత్రక కట్టడాల్ని ఆనందంగా చూస్తాం. అదే ఆ కోటకు వెళ్తే మాత్రం క్షణక్షణం భయపడుతూ చూడాల్సిందే. ఇక చీకటి పడుతుందంటే... ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సిందే. హర్రర్ సినిమాల్లో కూడా కనిపించనంత టెన్షన్ అక్కడ ఉంటుంది. ప్రాణాలతో బయటపడితే చాలనే ఆలోచన కలుగుతుంది. ఎందుకు? అంతలా భయపెట్టే పరిస్థితి అక్కడ ఏముంది? దెయ్యాల కోటగా చెప్పుకుంటున్న రాజస్థాన్‌లోని భాన్‌గఢ్‌ విశేషాలు ఇవి.

మీకు హర్రర్ సినిమాలన్నా... సస్పెన్స్ థ్రిల్లర్‌ స్టోరీలన్నా ఇష్టమైతే... మీకు కచ్చితంగా నచ్చే ప్లేస్ భాన్‌గఢ్ కోట. అక్కడికి వెళ్లేవాళ్లు ఎన్నో కథలు వింటారు. వెళ్లొచ్చాక... ఎన్నో కథలు చెబుతారు. ఈ రోజుల్లో... చేతిలో మొబైల్ ఉండటం ఎంత కామనో... ఆ కోటలో తిరుగుతూ టెన్షన్ పడటమూ అంతే కామన్.

రాజస్థాన్‌లోని జైపూర్ తెలుసుగా. అక్కడికి వెళ్లి... ఎవరైనా స్థానికులతో... "భాన్‌గఢ్ కోటకు వెళ్తున్నా" అని చెప్పండి. పైనుంచీ పిడుగు పడినట్లు అదిరి పడతారు వాళ్లు. మీవైపు ఒకింత అనుమానంతో చూస్తారు. మీకేదో చెప్పాలన్న ఆతృత వాళ్లలో ఉంటుంది. అలా ఎందుకో ముందు ముందు మీకే తెలుస్తుంది.

జైపూర్ నుంచీ 83 కిలోమీటర్ల దూరంలోని అల్వార్ జిల్లాలో ఉంది భాన్‌గఢ్ పట్టణం. అక్కడకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం ఉంది. ప్రైవేట్ వెహికిల్స్ కూడా ఉంటాయి. రెండు గంటల ప్రయాణం... అడుగడుగునా ఆహ్లాదం కలిగిస్తుంది. చుట్టూ చెట్లూ-చేమలతో... ఆరావళీ పర్వత శ్రేణుల మధ్య సాఫీగా సాగిపోతుంది ఈ పయనం.

భాన్‌గఢ్ పట్టణాన్ని చేరగానే... రెండు కిలోమీటర్ల దూరంలోని ఎత్తైన కొండపై అత్యద్భుతంగా కనిపిస్తుంది భాన్‌గఢ్ కోట. చారిత్రక వారసత్వ సంపదకూ, అలనాటి రాజఠీవీకి నిలువెత్తు నిదర్శనంలా ఉంటుందా కోట. అందులో ప్రతీదీ సుందర కళాఖండమే. ముఖ్యంగా అత్యంత ఎత్తులో ఉన్న రాయల్ ప్యాలెస్... రాచరికపు వైభవాన్ని చాటిచెబుతూ ఉంటుంది. ఇంత మంచి కోటను రాజస్థాన్ ప్రజలు మాత్రం భూత్ బంగళా, దెయ్యాల కోట అంటుంటారు. ఈ కోట దగ్గరే కాదు... భాన్‌గఢ్ పట్టణంలో కూడా జనం పెద్దగా నివసించరు. ఇందుకు బలమైన కారణాలున్నాయి.

భాన్‌గఢ్‌ కోట (Image credit - Wikipedia)

అల్వార్-జైపూర్ నగరాల మధ్య ఉన్న సరిస్కా టైగర్ పార్కును ఆనుకొని ఉంటుంది భాన్‌గఢ్ పట్టణం. ఎత్తైన కొండల మధ్య నిర్మించిన అందమైన పట్టణమిది. నాలుగు శతాబ్దాలకుపైగా చరిత్ర దీని సొంతం. ఇక్కడ పెద్ద పెద్ద కట్టడాలు, బురుజులు, హవేలీలూ.... చారిత్రక ఆనవాళ్లుగా దర్శనమిస్తాయి. రెండు మార్గాల్లో కోట దగ్గరకు వెళ్లేందుకు వీలుంది. కోట లోపల పచ్చిక బయళ్లు, సెలయేర్లూ, తోటలూ, ప్రాచీన ఆలయాలూ... అడుగడుగునా విశేషాలే. ఇంత చక్కగా ఉన్నా... ఈ పట్టణంలో జనం అస్సలు కనిపించరు. ఎందుకు లేరని టూరిస్టులు ఎవరైనా అడిగితే... రకరకాల దెయ్యాల కథలు చెబుతారు అక్కడి వాళ్లు.

కోట ప్రాంగణంలో సోమేశ్వర ఆలయం, గోపీనాథ్, కేశవరాయ్, మంగళదేవి, హనుమాన్, గణేశ్ ఆలయాలున్నాయి. శతాబ్దాల కిందటి నిర్మాణ శైలినీ, అప్పటి కళా చాతుర్యాన్నీ ఇవి చాటిచెబుతాయి. చిత్రమేంటంటే... ఈ భారీ సౌధంలో ఎక్కడా... ఒక్క విగ్రహం కూడా కనిపించదు. ఆలయాలు ఉన్నా... వాటి నిర్మాణాల్లో ఎక్కడా విగ్రహాల రూపురేఖలు ఉండవు. వందల ఏళ్ల నాటి మర్రిచెట్లు ఈ కోటలో మరో ప్రధాన ఆకర్షణ. చిన్న చిన్న జలపాతాల్ని కూడా ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ పర్యాటకులకు ఆనందాన్ని పంచేవే. 







Sariska National Park:
భాన్‌గఢ్ కోటకు దగ్గర్లో చూడదగ్గ ప్రాంతాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సరిస్కా నేషనల్ టైగర్ పార్కు (sariska national park) కచ్చితంగా చూడాల్సిందే. కోట నుంచీ 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పార్కు. ఇందులో సఫారీ మరచిపోలేని అనుభూతుల్ని మిగుల్చుతుంది. ఇక్కడ ఎలాంటి కంచెలూ అడ్డులేకుండా కళ్లముందే కదులుతూ వెళ్లే వన్యమృగాల్ని చూడొచ్చు. అవి వేటాడే దృశ్యాల్ని చూస్తే... ఎంతో థ్రిల్‌గా ఉంటుందంటారు టూరిస్టులు. ఈ పార్కులో కనిపించే పక్షులు కూడా చాలా అరుదైనవి. అంతా బాగానే ఉన్నా... కోట విషయమే ఆందోళన కలిగించే అంశం. ఇక్కడికి వెళ్లే టూరిస్టులంతా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఎవరైనా సరే.... సూర్యాస్తమయం కాకముందే... కోట, భాన్‌గఢ్ పట్టణం నుంచీ తిరుగు ప్రయాణం అవ్వాల్సి ఉంటుంది. పొరపాటున కూడా చీకటి పడుతున్నప్పుడు, రాత్రిళ్లు అక్కడ ఉండకూడదు.





చిత్ర విచిత్రాలు:
నమ్మశక్యం కాని విషయమేంటంటే... ఈ కోటలో ఎప్పుడూ ఏదో ఒక చిత్రమైన ఘటనలు జరుగుతూ ఉంటాయి. వాతావరణం ఉన్నట్టుండి మారిపోతూ ఉంటుంది. రాత్రివేళల్లో ఏవేవో అరుపులూ, ఏడుపులూ వినిపిస్తుంటాయట. ఆ అరుపులు దెయ్యాలవే అని రాజస్థానీల నమ్మకం. అందుకే ఆసియాలోనే ఇది అత్యంత భయంకరమైన దెయ్యాల కోట అన్న ప్రచారం వందల ఏళ్లుగా జరుగుతోంది. కోట ప్రారంభంలో ఉండే నాట్య కళాకారిణుల ప్రాంగణం, పక్కనే ఉన్న జవహరి బజార్‌ ఏరియాలో ఎవరెవరో నడుస్తున్న శబ్దాలు, గజ్జెల చప్పుడు తాము విన్నామని అప్పుడప్పుడూ పర్యాటకులు చెబుతుంటారు.

రాత్రైతే ఈ పట్టణంలోకి చుట్టుపక్కల అడవుల్లోని జంతువులు వస్తుంటాయి. పైగా ఇక్కడ కరెంటు కూడా ఉండదు. వీటికి తోడు ఇక్కడ దెయ్యాల కథలపై విపరీతంగా దుమారం రేగడంతో... భారత పురావస్తు శాఖ రంగంలోకి దిగింది. సందర్శకుల రక్షణను దృష్టిలో పెట్టుకొని భాన్‌గఢ్ పర్యటనపై ఆంక్షలు విధించింది. ఎవరైనా సరే... ఉదయం ఆరు నుంచీ సాయంత్రం ఆరు వరకే... భాన్‌గఢ్ పట్టణంలో ఉండొచ్చు. సూర్యాస్తమయం కాగానే... పట్టణంలోకి వెళ్లే రూట్ల గేట్లను మూసేస్తారు. ఇదే విషయాన్ని వివరిస్తూ... ఇక్కడో నోటీస్ బోర్డు కూడా ఉంటుంది.

సాహసమే ఊపిరిగా బతికే కొంతమంది... రాత్రివేళ ఈ కోటలోకి వెళ్లాలని ప్రయత్నిస్తుంటారు. అలా వెళ్లేవాళ్లు... ఇక జీవితంలో తిరిగి రారని అంతా అంటుంటారు. పురావస్తు శాఖ నిబంధనల వల్ల ప్రస్తుతం ఎవరూ రాత్రివేళ ఈ కోటలోకి వెళ్లే ఛాన్స్ లేదు. అందువల్ల భాన్‌గఢ్ అందాలు చూడాలంటే... ఉదయం వేళల్లో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది.


కోట చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. అక్కడక్కడా శిథిలమైపోతున్నా... చూడ్డానికి పటిష్టంగానే ఉంటుంది. మరి ఈ దెయ్యాల గోలేంటి? ఎందుకు జనం భయపడుతున్నారు? రాత్రివేళ ఆ కోటలోకి వెళ్తే ఏమవుతుంది? చరిత్రలో ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.

సహజంగానే ఇలాంటి పురాతన కట్టడాలపై నిశీధి నీడలు పడుతూనే ఉంటాయి. భాన్‌గఢ్‌ కూడా అందుకు అతీతమేమీ కాదు. కాకపోతే... ఈ కోటకు మాత్రమే పరిమితమైన కొన్ని చారిత్రక కథలున్నాయి. వాటి ప్రభావమే ఈ దెయ్యాల టెన్షన్. భాన్‌గఢ్ పట్టణాన్ని 1613లో నిర్మించారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ సర్వసేనాని మాన్‌సింగ్..... తన తమ్ముడైన మాధోసింగ్ కోసం ఈ కోటను కట్టించాడు. నాలుగు శతాబ్దాల కిందట ఈ కోట అత్యద్భుతంగా ఉండేది. అడుగడుగునా రాజఠీవీని ప్రదర్శిస్తూ... పాలకుల కీర్తి ప్రతిష్టల్ని నలుదిశలా చాటేది. మరి అలాంటి కోట... ఇప్పుడు దెయ్యాల కోటగా ఎందుకు మారిందన్నదానిపై ప్రధానంగా రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి.

పూర్వం ఈ కోట ప్రాంతంలో బాబా బాలక్ నాథ్ అనే సాధువు ఉండేవాడు. తాను తపస్సు చేసుకునేచోట కోటను నిర్మిస్తామనడం ఆయనకు నచ్చలేదు. అక్కడ కట్టే ఏ నిర్మాణమూ... తన ఇంటికంటే ఎత్తుగా ఉండకూడదని షరతు పెట్టాడు. ఏ భవనం నీడైనా తన ఇంటిపై పడితే... పట్టణం మొత్తానికీ గ్రహణం పడుతుందని శపించాడు. ఈ విషయాన్ని పాలకులు తేలిగ్గా తీసుకున్నారు. సాధువు ఇంటి చుట్టూ కూడా కోటను నిర్మించారు. ఫలితంగా శాపం అమలైంది. జనం లేనిపోని రోగాల బారిన పడ్డారు. ఊరు వల్లకాడైంది. అలా చనిపోయిన వాళ్లంతా దెయ్యాలయ్యారు. అందుకే ఈ కోట దెయ్యాలకు ఆవాసంగా మారిందన్నది ఓ నమ్మకం.

ఇక్కడ మరో రకమైన కథ కూడా ప్రచారంలో ఉంది. చేతబడి చేసే ఓ మంత్రగాడు... భాన్‌గఢ్ యువరాణి రత్నవతిని ప్రేమించాడు. 18 ఏళ్ల ఆమె... ఓ రోజు సెంటు బాటిల్ కొనేందుకు తన చెలికత్తెలతో షాపింగ్‌కి వెళ్లింది. అదిచూసిన మంత్రగాడు... తనే వ్యాపారిలా మారిపోయాడు. ఓ ఖరీదైన సెంటును ఆమెకు ఇచ్చి, ప్రేమ ఒలకబోశాడు. రత్నవతి చాలా తెలివైంది. అతను నిజమైన వ్యాపారి కాదని గ్రహించింది. వెంటనే అతన్ని సైనికులు బంధించారు. ఆమెను ప్రేమిస్తున్నట్లు మంత్రగాడు చెప్పడంతో రాజుగారికి కోపం వచ్చింది. బతికి ఉండగానే అతన్ని సమాధి చేయించాడు. చనిపోయేముందు మంత్రగాడు శపించాడు. తన చావుతో భాన్‌గఢ్ పట్టణం సర్వనాశనం అవుతుందన్నాడు. ఆ తర్వాత ఉత్తరాది నుంచీ వచ్చిన మొఘల్ చక్రవర్తులు... భాన్‌గఢ్‌పై దండెత్తారు. అప్పటి యుద్ధంలో యువరాణితోపాటూ... ఇక్కడ ఉండే పది వేల మంది జనం చనిపోయారు. వాళ్లంతా దెయ్యాలై, కోటలో తిరుగుతున్నారన్నది స్థానికుల విశ్వాసం.

దెయ్యాల భయంతో... భాన్‌గఢ్ జనం ఊరొదిలి వెళ్లిపోయారు. అందువల్ల శతాబ్దాలుగా ఈ పట్టణం మౌనంగా ఉండిపోయింది. 50 ఏళ్ల కిందటి వరకూ... ఈ కోట దగ్గరకు ఎవ్వరూ వెళ్లేవాళ్లే కాదు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కోటపై దృష్టిసారించాయి. దీన్ని చక్కటి పర్యాటక కేంద్రంగా మార్చాలనుకున్నాయి. కాకపోతే... ఈ దెయ్యాల సెంటిమెంట్... అభివృద్ధికి ఆటంకంగా మారింది. ఇక్కడ ఆత్మలు తిరుగుతున్నాయన్న భయం ఆధునిక అభివృద్ధి ఫలాల నుంచీ ఈ కోటను వెనక్కి నెట్టేస్తోంది. దీనిపై ఇప్పటికే చాలా డాక్యుమెంటరీలు వచ్చాయి. భాన్‌గఢ్ పేరుతో ఏడేళ్ల కిందట ఓ చిన్న సినిమా వచ్చింది. ఆ హర్రర్ సినిమాలో పగటి పూట దృశ్యాల్ని ఈ కోటలోనే షూట్ చేశారు.





ప్రాచుర్యంలో ఎన్ని కథలున్నా... భాన్‌గఢ్‌లో దెయ్యాలు ఉన్నాయా? లేవా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరికితీరాలి. మరి ఎవరైనా ఆ దిశగా ప్రయత్నించారా? దెయ్యాలు లేవని గానీ, ఉన్నాయని గానీ నిరూపించారా? అసలు దెయ్యాలు ఉన్నాయి అనేందుకు ఏవైనా బలమైన సాక్ష్యాలున్నాయా? ఆ దిశగా ఓసారి విశ్లేషిద్దాం.

సాధారణంగా ఏదైనా పాజిటివ్ రెన్పాన్స్‌తో అందరి నోళ్లలో నానుతూ ఉంటుంది. ఈ కోట మాత్రం నెగెటివ్ రెన్సాన్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ కోటను చూసేందుకు వచ్చే వాళ్లలో ఎక్కువ మంది... ఇది దెయ్యాల కోట అన్న ఉద్దేశంతోనే వచ్చామంటుంటారు.

ఈ కోటకు నాలుగు రకాల వాళ్లు వస్తుంటారు. పర్యాటకులు, పారానార్మల్ పరిశోధకులూ, చరిత్రకారులూ, స్థానికులు. వీళ్లలో పర్యాటకులూ, దెయ్యాల వేటగాళ్లు చెప్పే విషయాలు ఆసక్తి రేపుతున్నాయి. సందర్శకుల్లో కొంత మంది తాము దెయ్యాల్ని చూశామని చెబుతుంటారు. మరికొంతమందైతే... కోటలోని ఏ చీకటి దృశ్యాన్నో షూట్ చేసి... అదిగో అక్కడ దెయ్యం ఉంది అంటుంటారు. ఇక తుంటరోళ్లైతే... వాళ్లే దెయ్యాల్లా అరిచి, ఆ రికార్డుల్ని దెయ్యాల అరుపులుగా చెబుతుంటారు. ఇలాంటి సంఘటనలు కొన్ని వందల్లో ఉన్నాయి. ఒక్కదాన్నీ నిజమని నిరూపించే వీలు లేదు. పారానార్మల్ పరిశోధకులు కూడా అంతే. దెయ్యాల అరుపుల్ని రికార్డు చేసినట్లు చెబుతుంటారు. అవి స్పష్టంగా మాత్రం ఉండవు. నిజ నిర్ధారణ ముందు తేలిపోతాయి. ఫలితంగా ఇదో మిస్టరీగా మారింది.





దెయ్యాలు ఉన్నాయి అనేందుకు కొన్ని సంఘటనల్ని స్థానికులు ఉదాహరణలుగా చెబుతుంటారు. ఓసారి ఇద్దరు కుర్రాళ్లు... రాత్రివేళ రహస్యంగా ఈ కోటలోకి వెళ్లారట. వాళ్లు తిరిగి రాలేదు. రెండ్రోజుల తర్వాత వాళ్ల స్నేహితులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో... ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వాళ్లు ఏమయ్యారన్నది మిస్టరీగా మారింది. ఒకవేళ చనిపోయి ఉంటే... డెడ్‌బాడీలైనా దొరకాలిగా. అలాంటి ఆనవాళ్లేవీ లభించలేదు. పోనీ జంతువులేమైనా చంపి తినేశాయా అంటే... కనీసం రక్తపు మరకల ఆనవాళ్లు కూడా లేవట. ఇది ఎప్పుడు జరిగిందో కచ్చితంగా చెప్పట్లేదు ఎవరూ.

మరో ఘటనలో ముగ్గురు యువకులు టార్చిలైట్లతో కోటలోకి వెళ్లగా... వాళ్లలో ఒకడు... ఓ ఎండిపోయిన బావిలో పడ్డాడు. గాయాలపాలైన అతన్ని రాత్రివేళ కారులో తీసుకెళ్తుండగా... ఆ కారుకి యాక్సిడెంట్ అయ్యింది. అందులోని ముగ్గురూ చనిపోయారు. దెయ్యాలు వాళ్లను వెంటాడి, చంపాయన్నది స్థానికుల నమ్మకం. ఇది కూడా నిజంగా జరిగిందా అంటే ఆధారాలు లేవు. ఇలాంటి ఘటనల ప్రచారం మాత్రం తీవ్ర భయభ్రాంతులు కలిగిస్తోంది.

ఇక్కడ దెయ్యాలున్నట్లు ఒక్కటంటే ఒక్కటీ సరైన ఆధారం లేదు. జనం చూపించే వీడియోలు కూడా స్పష్టంగా లేవు. మొబైళ్లతో తీసిన వీడియోలు కూడా దెయ్యాల ఉనికిని చూపించట్లేదు. గ్రాఫిక్స్‌తో మార్ఫింగ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కానీ... జనంలో మాత్రం నమ్మకం బలంగా ఉంది. సైన్స్‌ని నమ్మే పరిశోధకులు చెబుతున్నదొకటే... ఈ కోటలో ఎలాంటి దెయ్యాలూ లేవు. ఉన్నదల్లా పావురాలు, గబ్బిలాలు మాత్రమే. వాటి అరుపులు, కూలిపోయేలా కనిపించే కోట గోడలే కాస్త భయం కలిగిస్తాయని చెబుతున్నారు.

రాత్రివేళ ఆరావళి నుంచీ వచ్చే జంతువుల అరుపుల్ని... దెయ్యాల అరుపులుగా జనం భ్రమపడుతున్నారని హేతువాదులు అంటున్నారు. ఓ మంచి పురాతన కట్టడాన్ని... దెయ్యాల కోటగా పిలుస్తూ... దాని ప్రాసస్థ్యాన్ని దెబ్బతీస్తున్నారని ఒకింత బాధపడుతున్నారు. సాధారణంగా ఏ కోటనైనా ఎలా చూడాలో రూట్ మ్యాప్ ఉంటుంది. ఇది ప్రేతాల కోటగా చెబుతుండటంతో... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై పెద్దగా దృష్టి పెట్టట్లేదు. అందువల్ల ఇక్కడ ఎలాంటి గైడ్లూ ఉండరు. కనీస సదుపాయాలూ లేవు. దీనికి తోడూ తరచుగా కోతులూ, అప్పుడప్పుడూ చిరుతపులులూ, హైనాలూ కోటవైపు వస్తుంటాయి.

పర్యాటక ప్రేమికులకూ, పారానార్మల్ పరిశోధకులకూ, చరిత్రకారులకూ, సినీ పరిశ్రమకూ... భాన్‌గఢ్ కోట ఎన్నో విశేషాల్ని చెబుతోంది. ఎన్నెన్నో కథలు వినిపిస్తోంది. అక్కడికి వెళ్లొచ్చేవాళ్లంతా... మరపురాని అనుభూతిని పొందుతుంటారు. జీవితంలో ఒక్కసారైనా వెళ్లి తీరాల్సిందే అని చెబుతుంటారు. ప్రభుత్వాలు దీన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కనీస సదుపాయాలూ, కరెంటు సరఫరా కల్పిస్తే... కచ్చితంగా దెయ్యాల గోల పోతుంది. పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది. చారిత్రక కట్టడాన్ని సంరక్షించినట్లూ అవుతుంది.


17, జులై 2021, శనివారం

Srilanka: బీచ్‌లు, సఫారీలు, బౌద్ధ క్షేత్రాలు, తేయాకు తోటలు... యుద్ధం విడిచి శాంతి గీతం ఆలపిస్తోందా?... శ్రీలంక

శ్రీలంక

Srilanka: చాలా సందర్భాల్లో ఇండియా మ్యాప్‌లో శ్రీలంక కూడా ఉంటుంది. కన్నీటి బొట్టులా కనిపించే ఈ దేశం... LTTE దాడుల నుంచీ విముక్తి పొంది... అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. చాలామందికి తెలియని విషయమేంటంటే... శ్రీలంకలో ఎన్నో టూరిస్టు స్పాట్‌లున్నాయి. కొన్నైతే... హిమాలయాల్ని తలపిస్తాయి. అందుకే శ్రీలంక సంగతులు, విశేషాలూ ఓసారి తెలుసుకుందాం. ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధాలయాలతో ఆకట్టుకుంటున్న శ్రీలంకలో పర్యటించేందుకు... ఓ ట్రైన్ జర్నీ ఎన్నో మధురానుభూతుల్ని మిగుల్చుతోంది. నిజమైన శ్రీలంకను చూసేందుకు అది బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. అదెలాగో తెలుసుకుందాం.

శ్రీలంకను చూడటమంటే... దాదాపు మన దేశాన్ని చూడటం లాంటిదే. ఇండియాలో కనిపించే సంస్కృతులు, పాటించే విధానాలూ... ఇక్కడా కనిపిస్తాయి. ఐతే... ఎంతో కొంత వైవిధ్యం ఉంటుంది. అదే... ఈ దేశాన్ని ప్రపంచ పటంలో ప్రత్యేకంగా నిలబెడుతోంది. LTTE యుద్ధం 2009లో ముగియడంతో... శ్రీలంకలో ఇప్పుడు ప్రశాంత వాతావరణమే కనిపిస్తోంది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఈ దేశం అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. 2015లో ప్రజాస్వామ్య దేశంగా మారాక... కొత్త అధ్యక్షుడిగా మైత్రిపాల సిరిసేనను జనం... ఓట్లు వేసి ఎన్నుకున్నారు. ప్రస్తుతం గోటబయ రాజపక్స (Gotabaya Rajapaksa) అధ్యక్షుడిగా ఉన్నారు.





సిలోన్ అని ముద్దుగా పిలుచుకునే ఈ ద్వీపం... పర్యాటకులకు నిజంగా స్వర్గధామమే. దీన్ని చూసేందుకు ట్రైన్‌ను మించిన బెస్ట్ ఆప్షన్ లేదు. పర్యాటక ప్రాంతాలతోపాటూ... నిజమైన శ్రీలంక జనం జీవిత చిత్రాల్ని చూడాలంటే... రైలు బండి ఎక్కాల్సిందే. రాజధాని కొలంబో ఫోర్ట్ స్టేషన్ (Fort railway station) నుంచీ ఈ జర్నీ మొదలవుతుంది.

మన కరెన్సీతో పోల్చితే... శ్రీలంక రూపాయి కరెన్సీ విలువ తక్కువ. మన దగ్గర వెయ్యి రూపాయలు... అక్కడ 2వేల 666వందలతో సమానం. సో, ఈ జర్నీ చీప్‌ అండ్ బెస్ట్ అనుకోవచ్చు. కొలంబో నుంచీ రైలు... 9 గంటలపాటూ.... 270 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది రంబుక్కానా, కాండీ, పట్టిపోలా మీదుగా ఎల్లాకి వెళ్తుంది. లంకలో బ్రిటిషర్స్ వేసిన మొదటి రైల్వే లైన్ ఇది. దీన్ని మెయిన్ లైన్ అని పిలుస్తారు.

ట్రైన్ 54 కిలోమీటర్లు వెళ్లగానే... అంబక్కూసా వస్తుంది. 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఊరు అది. ఆ ఊరుకి వెళ్లే దారిలో కలానీ నదిని దాటే దృశ్యం చూడచక్కగా ఉంటుంది. శ్రీలంకలోని పొడవైన నదుల్లో ఇదీ ఒకటి. ఈ జర్నీ జనరల్ టికెట్ రేటు... మన కరెన్సీలో 120 రూపాయలు. ఫస్ట్ క్లాస్ అయితే... 650 రూపాయలు. 150 ఏళ్ల చరిత్ర ఉన్న రైల్లో ప్రయాణించడాన్ని గర్వంగా ఫీలవుతారు లంకేయులు. బస్సులో కంటే... రైలు జర్నీనే ఎక్కువగా ఇష్టపడతారు.

శ్రీలంక సంపన్న దేశం కాకపోవడంతో... ఇండియాలాగే... ఇక్కడ కూడా... చదివిన చదువుకి తగిన ఉద్యోగాలు లేవు. ఏళ్లుగా వ్యవసాయమే ఇక్కడ ప్రధాన జీవనాధారం. ఈ దేశంలోని 21 శాతం పిల్లలకు సరైన పౌష్టికాహారం లేదు. సంపన్నులు, పేదల మధ్య గ్యాప్... ఎక్కువే. అందుకే... థర్డ్ క్లాస్‌ జర్నీ ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ట్రైన్‌లో గంటన్నర ప్రయాణించాక రంబుక్కానా స్టేషన్ వస్తుంది. ఇదో పర్యాటక ప్రాంతం.

ఇక్కడి పిన్నవాలా ఏనుగుల రక్షణ కేంద్రం (pinnawala elephant orphanage) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కేంద్రం నిర్వాహకులు రైలు ప్రమాదాల్లో దెబ్బతిన్న ఏనుగులు, అడవిలో గాయపడిన గజరాజులకు ఇక్కడ ప్రత్యేక ట్రీట్‌మెంట్ చేస్తారు. మాయో ఓయో నదిలో... ఏనుగులకు రోజూ స్నానం చేయిస్తారు. ఇలా చేస్తే అనారోగ్యంతో ఉన్న ఏనుగులకు వ్యాధులు నయమవుతాయని నమ్ముతారు.

ప్రస్తుతం ఈ కేంద్రంలో 96 ఏనుగులున్నాయి. వీటిని దగ్గరగా చూసే పర్యాటకులకు పరమానందమే. గున్న ఏనుగులకు పాలు ఇచ్చి ఖుషీ అవుతారు. ప్రతీ పిల్ల ఏనుగూ... రోజుకు 7 లీటర్ల పాలు తాగుతుంది.

రంబుక్కానా స్టేషన్ దాటాక... ఈ ట్రైన్.... పల్లెలు, పట్టణాలు, కొండలు, సొరంగాల్లోంచీ వెళ్తుంది.

శ్రీలంకలో వజ్రాల పరిశ్రమ డెవలప్ అవుతోంది. ఇక్కడి స్వర్ణ కార్మికులు... వజ్రాల్ని సానపెట్టి... ఆభరణాలు తయారుచేస్తారు. టూరిస్టులకు ఇదో ప్రత్యేక అనుభవం. ఒక్కో కార్మికుడూ... నెలకు మన కరెన్సీలో అయితే... 15వేలు సంపాదిస్తాడు. అదే లంక కరెన్సీలో చెప్పాలంటే... 40 వేల రూపాయలతో సమానం.

రైలు మూడున్నర గంటల్లో... 130 కిలోమీటర్లు ప్రయాణించి... కాండీని చేరుతుంది. సింగళీయుల చారిత్రక రాజధాని ఈ కాండీ. ఎత్తైన ప్రదేశం కావడంతో... ఇక్కడి వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉంటుంది.

శ్రీలంక జాతీయ పుష్పం... బ్లూ వాటర్ లిల్లీని ఇక్కడ అమ్ముతూ ఉంటారు. బుద్ధ భగవానుడికి దీన్ని సమర్పిస్తారు. ఇక్కడి శ్రీ దలదా మాలిగావా బౌద్ధాలయం (dalada maligawa buddha pujawa) స్థానికంగా ఫేమస్. ఈ క్షేత్రంలో బుద్ధుడి దంతాన్ని పదిలపరిచారు. ప్రపంచం నలుమూలల నుంచీ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ రోజూ 90 నిమిషాలపాటూ జరిగే పూజను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు.

పర్యాటకులు... బుద్ధుడి ప్రతి రూపానికి బదులు బంగారు పూతతో ఉన్న పగోడాను మాత్రమే ఈ ఆలయంలో చూడగలరు. ఇందులోనే బుద్ధుడి దంతాన్ని భద్రపరిచారు. ఈ ఆలయం వల్ల... కాండీ... యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేరింది. నృత్య రీతులకు కూడా కాండీ గుర్తింపుపొందింది. ఒకప్పుడు కాండీ రాజులకు అనారోగ్యం వచ్చినప్పుడు... నర్తకీమణులు... నృత్యాలు చేసేవాళ్లు. 1932 నుంచీ ఆ నృత్యాల్ని ఇక్కడ పర్యాటకుల కోసం ప్రదర్శిస్తున్నారు.


శ్రీలంక అనగానే... అదో చిన్న ద్వీపం. గొప్పగా చెప్పుకునేంత విషయాలేవీ ఉండవు అక్కడ. అనుకుంటారు చాలా మంది. నిజమేంటంటే... తేయాకు ఎగుమతికి ఆ దేశం ఫేమస్. ఇంకా చాలా విశేషాలున్నాయి. రైల్లో వెళ్తూ... ఆ సంగతులు తెలుసుకుందాం.

ఎత్తైన కొండల్లోంచీ రైలు వెళ్తుంటే... ఆ దృశ్యం నయనమనోహరం. మెయిన్ లైన్ రైల్వే మార్గం... మరింత పైకి వెళ్తూ ఉంటుంది.

శ్రీలంకలోని ప్రధాన వ్యాపారాల్లో టెక్స్‌టైల్ బిజినెస్ ఒకటి. దీనిపై ఆధారపడి వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇండియాలో లాగానే... ఇక్కడ కూడా నేత కార్మికులకు నెలకు వచ్చే వేతనం 4వేల రూపాయలే. ఈ దేశ కరెన్సీలో చెప్పాలంటే... 10 వేలతో సమానం.

కొండలపై నుంచీ తేయాకును కొలంబోకి తరలించేందుకు బ్రిటీష్ వాళ్లు ఈ రైల్వే లైన్ వేశారు. ప్రస్తుతం 2వేల 2వందల చదరపు కిలోమీటర్ల భూభాగంలో తేయాకును సాగు చేస్తున్నారు. చాలా మందికి ఇది ఉపాధి కల్పిస్తోంది. ఇక్కడి తేయాకు కార్మికులు లంక కరెన్సీలో రోజుకు 250 రూపాయల దాకా సంపాదిస్తున్నారు. కార్మికులు సేకరించిన తేయాకును హల్ఫా టీ ఫ్యాక్టరీకి తరలిస్తారు. ఇక్కడ ఆకుల్ని ప్రాసెస్ చేసి... చిన్న, లేత ఆకుల్ని నాణ్యమైనవిగా గుర్తిస్తారు. ఆకు పెద్దదైతే... రెండో రకం కింద లెక్క. ఈ ఫ్యాక్టరీలో వంద మంది దాకా వర్కర్లు పనిచేస్తున్నారు. దీనికి వందేళ్ల చరిత్ర ఉంది. టీని ఎక్కువగా ఎగుమతి చేసే దేశాల్లో శ్రీలంక కూడా ఉంది.

ట్రైన్ నానూ-ఓయా స్టేషన్‌కు చేరుతుంది. లంకలో ట్రైన్‌..... స్టేషన్‌కి రాగానే... డ్రైవర్‌కి ఓ టోకెన్ ఇవ్వడం పరిపాటి. తద్వారా నెక్ట్స్ స్టేషన్‌కి వెళ్లేందుకు ఆ డ్రైవర్‌కి అనుమతి ఇచ్చినట్లవుతుంది. పైగా... టోకెన్ ఇవ్వడం ద్వారా... ఆ మార్గంలో ఎలాంటి ఇబ్బందులూ లేవని చెప్పినట్లే. బ్రిటీష్ కాలంలో... నానూ-ఓయాలో హార్స్ రేసులు జరిగేవి. ప్రస్తుతం అవి లేవు. ఐతే... అప్పటి గోల్ఫ్ క్లబ్ మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది.

కొండలూ, కోనల్లోంచీ ప్రయాణిస్తూ... ట్రైన్... పట్టిపోలను చేరుతుంది. 1891 మీటర్ల ఎత్తులో... కూల్‌గా ఉంటుంది ఈ స్టేషన్. ఇక్కడ అత్యంత ఎత్తైన ప్రాంతం 1898 మీటర్లపైన ఉంటుంది. మంచు కురుస్తూ ఆహ్లాదం కలిగిస్తుంది. బ్రాడ్ గేజ్ రైల్వే అత్యంత ఎత్తులో ఉన్న ప్రదేశం ఇదే. ఈ కారణంగా ఇది గిన్నిస్ బుక్‌లో చేరింది. కొలంబో నుంచీ 224 కిలోమీటర్ల దూరంలో ఉందీ ప్రదేశం. ఈ ఏరియాలో ప్రకృతిసిద్ధ స్పాలు ఉంటాయి. మసాజ్ చేయించుకునేవారికి ఇదో విరామ కేంద్రం. తాము చేసే మసాజ్.... శరీరంలో 107 భాగాలపై ప్రభావం చూపిస్తుందని, చాలా ఎనర్జీ వస్తుందనీ చెబుతుంటారు థెరపిస్టులు.

ట్రైన్ జర్నీ చివరి స్టేషన్ ఎల్లాకు చేరుతుంది. ఈ మెయిన్ లైన్ రైల్వేను యునెస్కో... హెరిటేజ్ రైల్వే లైన్‌గా గుర్తించింది. 9 గంటల్లో టూరిస్టులు... మరో ప్రపంచాన్ని చూసేందుకు ఈ లైన్ చక్కగా ఉపయోగపడుతుంది.


ట్రైన్ జర్నీతోపాటూ శ్రీలంకలో టాప్ 5 టూరిస్ట్ స్పాట్‌లు తప్పకచూడాలి. ప్రపంచానికి తెలియని ఎన్నో అద్భుత ప్రదేశాల్ని తనలో దాచుకుంది శ్రీలంక. బౌద్ధ ఆరామాలు, బ్రిటీష్ సంస్కృతి, ఫారెస్ట్ సఫారీ ఇలా... ఎన్నో పర్యాటక ప్రదేశాలున్నాయి. వాటిలో టాప్ 5లో ఉన్న టూరిస్ట్ ప్లేస్‌లను ఇప్పుడు తెలుసుకుందాం.





Yala National Park:
చుట్టూ అడవి... అందులో జంతువుల్ని దగ్గర నుంచీ చూడటం... లైఫ్‌లో మర్చిపోలేని థ్రిల్. ఆ అనుభూతి కలిగించేందుకు శ్రీలంకలో చాలా నేషనల్ పార్కులున్నాయి. వాటిలో యాలా సఫారీ ప్రత్యేకమైనది. ఇది ఆఫ్రికా... కెన్యాలో లాంటి బెస్ట్ సఫారీ కాకపోయినా... ఇందులో కూడా ఏనుగులు, చిరుతలూ, జింకలూ, ఇతరత్రా ప్రాణులు కనిపిస్తాయి. యాలా సఫారీకి ఓ రోజంతా కేటాయించాల్సి ఉంటుంది. ఎంత ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తే... అన్ని ఎక్కువ జంతువుల్ని చూసే వీలు కలుగుతుంది.





Dambulla Cave Temple:
దంబుల్లాలో... బౌద్ధ గుహాలయాలు ప్రాచీనమైనవి. పక్కపక్కనే ఉండే 5 గుహల్లో రంగురంగుల రాతి విగ్రహాలు ఆకట్టుకుంటాయి. వాటిలో ఒకటి... 2 వేల ఏళ్ల నాటిది. 5 గుహల్లో... పెద్ద గుహలో... నిటారుగా ఉన్న 16 విగ్రహాలుండగా... మరో 40 వాలినట్లుగా ఉన్నాయి. బుద్ధుడి జీవిత కథను చెబుతూ... రకరకాల భంగిమల్లో ఈ ప్రతిమలున్నాయి. ఈ గుహల సీలింగ్స్‌పై రకరకాల పెయింటింగ్స్ ఉంటాయి. శతాబ్దాలుగా అవి వెలిసిపోకుండా ఉండటం విశేషం. బయటి వాతావరణం వేడిగా ఉన్నా... గుహల లోపల మాత్రం చల్లగా ఉంటుంది. ప్రశాంత తత్వం, భక్తిభావం వెల్లివిరుస్తుంది.





Sigiriya Rock Fortress:
సిగిరియా రాతి కోట. నిజానికి ఇదో అగ్నిపర్వత లావా వల్ల ఏర్పడిన కొండ. ఐదో శతాబ్దంలో అప్పటి రాజు దీన్ని కోటలా మలిచాడు. దీనిపై సైనిక బలగాల్ని మోహరించాడు. ఈ కోట రాతి గోడలపై... పెయింటింగ్స్ ఆకట్టుకుంటాయి. మెట్ల మార్గంలో పైకి వెళ్లడం కష్టంగా అనిపించినా... పైకి వెళ్లాక అద్భుతంలా అనిపిస్తుంది. ఇక్కడి రాతిపై చెక్కిన భారీ సింహపు విగ్రహం ప్రస్తుతం లేకపోయినా... దాని పంజాలను బట్టీ... అది ఎంత పెద్దగా ఉండేదో ఊహించుకోవచ్చు.





Ancient City of Polonnaruwa:
పొలొన్నరువా... ఇదో ప్రాచీన బౌద్ధ నగరం. ప్రస్తుతం శిథిలమై... అలనాటి బౌద్ధ ప్రాసస్థ్యాన్ని చాటిచెబుతోంది. ఇప్పటి రాజధాని కొలంబో అయినా... వెయ్యేళ్ల కిందట... పొలొన్నరువాయే... రాజధాని. అప్పటి రాజు ఒకటో విజయబాహు... ఈ నగరాన్ని అద్భుతంగా మలిచాడు. ఒక్కసారి ఈ నగరంలోకి వెళ్లి చూస్తే.... అప్పట్లో ఇది ఎంత గొప్పగా ఉండేదో అర్థమవుతుంది. దీన్ని పరిరక్షించే ఉద్దేశంతో... యునెస్కో... ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.





Bentota Turtle Sanctuary:
శ్రీలంకలో తాబేళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2004లో సునామీ తాకిడికి... చాలా తాబేళ్లు చనిపోయాయి. అప్పటి నుంచీ... తాబేళ్ల సంరక్షణకు చాలా కేంద్రాలు వెలిశాయి. వాటిలో బెంటోటా టర్టిల్ శాంక్చురీ గురించి చెప్పుకోవాల్సిందే. శ్రీలంక నైరుతీ సముద్ర తీరాన... ఈ సంరక్షణ కేంద్రం ఉంది. ఇక్కడ తాబేళ్లను పెంచడమే కాదు. వాటి గుడ్లను కూడా సేకరిస్తారు. స్థానికులు తాబేళ్ల గుడ్లను రెస్టారెంట్లలో అమ్మనివ్వకుండా... వాటిని వీళ్లే కొంటారు. అవి పిల్లలయ్యేలా చేస్తారు. అలా... పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతోంది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు కూడా విరాళాలు ఇస్తూ, వాలంటీర్లుగా పనిచేస్తూ.... తాబేళ్ల సంఖ్యను పెంచేందుకు సాయపడుతున్నారు.

మనకు చాలా దగ్గర్లో ఎన్నో పర్యాటక ప్రదేశాలతో ఆకట్టుకుంటోంది శ్రీలంక. పైగా... అక్కడ కరెన్సీ విలువ కూడా తక్కువ కావడంతో... ఎక్కువ ఖర్చుపెట్టకుండానే... ఎన్నో ప్రదేశాల్ని చూసి రావచ్చు. అందుకే భారతీయులకు ఇదో హాట్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా మారుతోంది.

16, జులై 2021, శుక్రవారం

Mystic Temples: ఆ విగ్రహం అలకపాన్పు ఎక్కిందా? ఆ గుళ్లోకి వెళ్తే చనిపోతారా? ఆలయాలు - రహస్యాలు!

ఆలయాలు - రహస్యాలు!


మన దేశం ఎన్నో చారిత్రక ఆలయాలకు నిలయం. ప్రపంచంలో ఎక్కడా లేనంత... పురాతన వారసత్వ సంపద మన సొంతం. చాలా ఆలయాల చరిత్ర, విశిష్టతల గురించి మనందరికీ ఎంతో కొంత తెలుసు. ఐతే... ఇప్పటికీ కొన్ని టెంపుల్స్‌లో అంతుపట్టని రహస్యాలు చాలా ఉన్నాయి. అవేంటో, ఎందుకో తెలుసుకుందాం.

మనందరం... కంచి నుంచీ... కాశ్మీర్ వరకూ... ఎన్నో ఆలయాలకు వెళ్తుంటాం. దైవ దర్శనం తర్వాత... కాసేపు అక్కడే ఉండి... ప్రసాదం స్వీకరించి... తిరిగి వెళ్లిపోతాం. ఐతే... ఆ టెంపుల్స్ వెనక చాలా రహస్యాలుంటాయి. ఆ మిస్టరీలు ఛేదించేందుకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

ఈ ప్రపంచంలో... మనది భక్తి-భావ ప్రపత్తుల దేశం. 64 కోట్ల దేవుళ్లు, దేవతలు నడయాడే పవిత్ర భూమి. అందుకే... ప్రతీ వీధిలో ఓ గుడి ఉంటుంది. ఐతే... అన్ని గుళ్లూ ఒకేలా ఉండవు. కొన్ని వైవిధ్యంగా, ఆశ్చర్యం కలిగిస్తాయి. కొన్నింటి చరిత్ర నమ్మశక్యం కాదు కూడా. అసలు ఇలాంటి ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయా అనిపిస్తుంది వాటి విశేషాలు తెలుసుకుంటే. ఇంకొన్ని గుళ్లైతే... వాటిలో జరిగే ఆచారాలు, సంప్రదాయాల్ని చూసి ముక్కున వేలేసుకుంటాం. ఇవన్నీ ఒక ఎత్తైతే... 2వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న... పురాతన ఆలయాల ప్రాసస్థ్యం అంతా ఇంతా కాదు.

Mahendipur Balaji Temple, Rajasthan:
"దెయ్యాలూ, భూతాలూ, పిశాచాలూ, చేతబడుల వంటివి వదిలిపోవాలంటే ఏం చెయ్యాలి" అని రాజస్థాన్ జనాన్ని అడిగితే... వాళ్లు చెప్పే సమాధానం... మహేందీపూర్ బాలాజీ ఆలయానికి వెళ్లమని. దౌసా జిల్లాలో ఉంది ఈ టెంపుల్. రోజూ వేల మంది భక్తులు అక్కడకు వెళ్తుంటారు. వాళ్లు చూపించే భక్తి... భరించలేని విధంగా ఉంటుంది. కొందరు సలసలా కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటారు. ఇంకొందరు ఉరి వేసుకున్నట్లు వేలాడతారు. మరికొందరైతే... గొలుసులతో కట్టేసుకుని... తలను గోడకేసి కొట్టుకుంటారు. ఇదంతా ఎందుకంటే... తమను దెయ్యాలు వదిలిపోవాలి అంటారు. పూజారులే దగ్గరుండి ఇలాంటివి చేయించడం బహుశా దేశంలో ఈ ఒక్క గుడిలోనే కావచ్చు. అన్నట్టు ఇక్కడ ప్రసాదం ఇవ్వరు. ఆలయం నుంచీ వెళ్లిపోయేటప్పుడు... వెనక్కి తిరిగి చూడకూడదట. అలా చూస్తే... దెయ్యాల్ని తమలోకి రమ్మని పిలిచినట్లట. ఇది నిజమా, కాదా అంటే... ఎవరి నమ్మకాలు వాళ్లవి.

 

కొడుంగల్లూర్ భగవతీ ఆలయం (image credit - Wikipedia)

Kodungallur Bhagavathy Temple, Kerala:
సాధారణంగా మనం దేవుణ్ని కీర్తిస్తాం. అదే ఈ టెంపుల్‌కి వెళ్తే మాత్రం తిట్టాల్సిందే. కేరళలోని కొడుంగల్లూర్ భగవతీ ఆలయం ప్రత్యేకత ఇది. ఏటా ఇక్కడ 7 రోజులపాటూ ఉత్సవాలు జరుగుతాయి. ఆ టైమ్‌లో భక్తులు...  కత్తులతో ఎంటరవుతారు. తలపై దాడి చేసుకుంటారు. రక్తం ప్రవాహంలా కారుతుంది. అలాగే గుళ్లోకి వెళ్తారు. భద్రకాళీ అమ్మవారిని నానా తిట్లు తిడతారు. తిట్ల దండకమే కాదు... భక్తి గీతాల రూపంలో కూడా తిట్టిపోస్తారు. అక్కడితో అయిపోదు. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ... గుడిపైకి రాళ్లు విసురుతారు. ఏటా రాళ్లతో కొడుతుండటం వల్ల ఆలయం దెబ్బతింటోంది. ఇక్కడ పూజా-కైంకర్యాలు, కొబ్బరికాయలు కొట్టడాలు లాంటివి ఉండవు. 7 రోజుల ఉత్సవాల తర్వాత... వారం పాటూ ఆలయాన్ని మూసివేస్తారు. ఆ టైమ్‌లో... రక్తపు మరకల్ని శుభ్రం చేస్తారు.

Stambheshwar Mahadev Temple, Gujarat:
అప్పుడప్పుడూ మాయమై... తిరిగి కనిపించే టెంపుల్‌కి వెళ్లాలనుకుంటున్నారా? ఐతే... గుజరాత్.. వడోదరలోని స్తంభలేశ్వర్ మహదేవ్ ఆలయాన్ని దర్శించుకోండి. అరేబియా సముద్ర తీర జలాల్లో ఉందీ గుడి. ఇక్కడి ఈశ్వరుడు... ధైర్యం చేసి తన దగ్గరకు వచ్చేవాళ్లను కరుణిస్తాడని భక్తుల అపార నమ్మకం. సముద్ర అలల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించగలం. పెద్ద అలలు వస్తున్నప్పుడు... ఇది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. కొన్ని గంటల తర్వత తిరిగి కనిపిస్తుంది. ఈ ప్రత్యేకతే ఈ గుడిని ఫేమస్ టెంపుల్‌గా మార్చేసింది.

Tirumala Temple:
మన తెలుగువారి తిరుమల టెంపుల్‌ కూడా ప్రత్యేకమైనదే. పూజలు, భక్తజన సందోహం ఇవన్నీ ఒక ఎత్తు. కేశ సంపద మరో ఎత్తు. రోజూ ఈ ఆలయంలో 60 వేల మంది దాకా తలనీలాల రూపంలో మొక్కు చెల్లిస్తున్నారు. అందువల్ల ఏటా వందల టన్నుల కొద్దీ జుట్టు పోగవుతోంది. దీన్ని ఈ-వేలంలో అమ్మితే... TTDకి 300 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. తిరుమలలో హుండీ ఆదాయం తర్వాత... ఎక్కువ రెవెన్యూ వస్తున్నది ఈ జుట్టు ద్వారానే. టీటీడీ నుంచీ... ఈ జుట్టు విదేశాలకు వెళ్తోంది. ఎక్కువగా అమెరికా, ఇటలీ, చైనాకు ఎక్స్‌పోర్ట్ అవుతోంది. అక్కడి విగ్గుల కంపెనీలు ఈ హెయిర్‌తో విగ్స్ తయారుచేస్తున్నాయి. చైనాలో విగ్స్‌తోపాటూ... ఆహారాన్ని నిల్వ ఉంచేందుకు కూడా జుట్టును వాడుతున్నారు. మన దేశంలో ముంబైకి వెళ్తున్న కేశాల్ని... బాలీవుడ్ స్టార్స్ కోసం విగ్స్ తయారుచేస్తున్నారు.
పుష్కర్ లోని బ్రహ్మ ఆలయం (image credit - Rajasthan)

Brahma Temple, Pushkar, Rajasthan:
హిందూ పురాణాల ప్రకారం... త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మకు... ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఒకే ఒక్క ఆలయం. అదే... రాజస్థాన్‌... పుష్కర్ లోని బ్రహ్మ ఆలయం. క్రీస్తు శకం పద్నాలుగో శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఔరంగజేబు... మన దేశాన్ని పాలించిన సమయంలో... చాలా హిందూ ఆలయాలు ధ్వంసమైనట్లు చరిత్ర చెబుతోంది. ముఖ్యంగా పుష్కర్‌లో ఆలయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఐతే... బ్రహ్మ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఔరంగజేబు అనుచరులెవరూ దాన్ని టచ్ చెయ్యకపోవడం విశేషం. పాలరాయితో చెక్కిన ఆ ఆలయం లోపలి గోడలకు... భక్తులు సమర్పించిన విరాళాలతో సేకరించిన... వెండి నాణేలు అమర్చారు. ఈ టెంపుల్, దీని చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందన్నది భక్తుల మాట.

మన దేశంలో ఏ పర్యాటక ప్రాంతానికి వెళ్లినా... అక్కడ తప్పనిసరిగా ఆలయాలుంటాయి. కొన్ని సందర్భాల్లో... ఆలయాల వల్లే... పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. అలాంటి ఆలయాల విశేషాల్ని తెలుసుకుందాం.

Rat Temple, Rajasthan:
రాజస్థాన్‌... బికనూర్‌కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఓ చిత్రమైన గుడి. అదే... దేష్నాక్‌లోని కార్నీ మాత టెంపుల్. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే... ఎలుకల్ని పూజిస్తారు. దుర్గాదేవికి ప్రతిరూపమైన కార్నీ మాతను... ఎలుకల్లో చూసుకుంటారు ఇక్కడి భక్తజనం. అందుకే ఈ ఆలయంలో... ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి. భక్తులు వాటికి పాలు, ఇతర ప్రసాదాలు పెడతారు. బికనూర్ పర్యటనకు వెళ్లే టూరిస్టులు... తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ఎందుకంటే... ఎలుకలకు పూజ చెయ్యడమన్నది అరుదైన విషయం. చాలా మంది వాటిని వీడియోలు తీసుకుంటారు. పాలచుట్టూ... రౌండ్‌గా మూగి... రాట్స్.... మిల్క్ తాగుతుంటే... ఆ దృశ్యాల్ని మొబైల్ కెమెరాల్లో బంధిస్తారు.

Kal Bhairav Nath Temple, Varanasi:
ఏ గుళ్లోనైనా స్వీటో, హాటో ప్రసాదంగా పెడతారు. ఈ టెంపుల్‌లో మాత్రం... మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. పవిత్ర క్షేత్రం వారణాసిలో... శివుడి ప్రతిరూపమైన కాల భైరవనాథ్ ఆలయం ఇది. ఇక్కడ నైవేద్యం సహా... దేవుడికి సమర్పించే ప్రతీదాన్నీ... మద్యంతోనే తయారుచేస్తారు... అది విస్కీ కావచ్చు లేదా వైన్ కావచ్చు. కాలభైరవుడి నోట్లో ఆల్కహాల్ పోస్తారు. దాన్నే ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. మామూలుగా ఆలయాల చుట్టుపక్కల షాపుల్లో పువ్వులు, స్వీట్ల వంటివి అమ్మడం కామన్. ఇక్కడ మాత్రం ఏ షాపుకి వెళ్లినా మద్యమే అమ్ముతారు.

China Kali Temple, Kolkata:
కోల్‌కతాలోని తాంగ్రాలో... చైనాటౌన్ ఉంది. దానికి ఆ పేరు రావడానికి కారణం... అక్కడ ఉండేవాళ్లలో చైనీయులే ఎక్కువ. వాళ్లు... కాళీమాతను పూజిస్తారు. అందుకే... ఈ ఆలయానికి చైనీస్ కాళీమాత టెంపుల్ అనే పేరు వచ్చింది. మనమైతే... అమ్మవారికి నైవేద్యంగా ఏ పులిహోరో, స్వీటో పెడతాం కదా. చైనీయులు... నూడుల్స్, చాప్‌సుయ్ లాంటివి పెడతారు. అదే ఈ ఆలయం స్పెషాలిటీ.

Kadu Malleshwara Temple, Bangalore:
బెంగళూరులో కాడు మల్లేశ్వరస్వామి టెంపుల్ తనదైన ప్రత్యేకతతో ఆకట్టుకుంటోంది. 1997లో ఈ ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరపగా ఓ నంది బయటపడింది. దాని నోటి నుంచీ నీటి ప్రవాహం వస్తుండటం ఆశ్చర్యం కలిగించింది. మరింత తవ్వగా... ఓ నీటి కొలను కూడా బయటపడింది. అప్పటి నుంచీ... ఆలయ రూపురేఖల్ని మార్చారు. నంది నోటి నుంచీ వచ్చే నీరు... శివలింగం పై పడి... ప్రవహించేలా ఏర్పాట్లు చేశారు. ఐతే... నంది విగ్రహంలోకి నీరు ఎక్కడి నుంచీ వస్తుందో తెలియలేదు. ఈ నీరే... ఇక్కడున్న విషభవతి నదికి జీవ జలం అని నమ్ముతారు స్థానికులు.

Hadimba Temple, Manali, Himachal Pradesh:
మంచుకురిసే మనాలీలో... ప్రత్యేక ఆలయం ఈ హడింబా టెంపుల్. 4 అంతస్థుల ఈ ఆలయం... పగోడా ఆకారంలో ఉండటమే విశేషం. ఈ చుట్టుపక్కల ఎక్కడా... ఆ మాటకొస్తే... మన దేశంలోనే ఇలాంటి ఆలయాలు అరుదు. తూర్పు ఆసియా దేశాల్లో కనిపించే పగోడా నిర్మాణ శైలి... ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఆలయంలో హడింబా దేవి కొలువుదీరి ఉంటుంది. రాక్షసుడైన హడింబా చెల్లెలు ఈమె. కుల్లు రాజులు... హడింబా దేవిని ఇష్టదైవంగా పూజించేవాళ్లు. ఐతే... అమ్మవారి కంటే... నిర్మాణశైలి వల్లే ఈ ఆలయం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Brihadeeswara Temple, Tamil Nadu:
అద్భుత కళా నైపుణ్యం... తమిళనాడు... తంజావూర్‌లోని... బృహదీశ్వరాలయం సొంతం. ఈ టెంపుల్‌లో ఎక్కువ భాగం... శుద్ధమైన గ్రానైట్‌తో నిర్మించారు. ఇదే సైంటిస్టులకు సవాలు విసురుతోంది. ఎందుకంటే... ఈ ఆలయానికి చుట్టుపక్కల 60 కిలోమీటర్ల వరకూ... గ్రానైట్ నిక్షేపాలు, ఆనవాళ్లూ లేవు. ఎప్పుడో వెయ్యేళ్ల కిందట ఈ ఆలయాన్ని నిర్మించేందుకు ఎక్కడి నుంచీ గ్రానైట్ తీసుకొచ్చారు? ఎలా తెచ్చారు? అన్నది ఆశ్చర్యకరం. ముఖ్యంగా గోపురం 80 టన్నుల బరువున్న ఏకశిలతో తయారైంది. ఏ క్రేన్లూ లేకుండా.... ఆ భారీ శిలను, అంత ఎత్తుకి ఎలా చేర్చగలిగారన్నది అంతుబట్టని రహస్యంగా మిగిలిపోయింది.

ఎప్పుడో శతాబ్దాల కిందట నిర్మించిన ఆలయాలు... ఇప్పటికీ సైన్స్‌కి అందని నిగూఢ రహస్యాల్ని తమలో దాచుకున్నాయి. కొన్ని ఆలయాల్లో విగ్రహాలు, కొన్ని ఆలయాల నిర్మాణ శైలి... నేటి ఆధునిక సాంకేతికతకు అంతుచిక్కని మిస్టరీలుగా మిగిలిపోయాయి. అలాంటి మరికొన్ని తెలుసుకుందాం.
బుద్ధ నీలకంఠ ఆలయంలో విష్ణుమూర్తి (image credit - wikipedia)

Buddha neelakanta kathmandu, Nepal:
ఇది బుద్ధ నీలకంఠ ఆలయం.... పేరులో బుద్ధ ఉన్నా... నిజానికి ఇది మహా విష్ణువు వెలసిన ఆలయం. బుద్ధ నీలకంఠ అంటే... పురాతన నీలపు రంగు విగ్రహం అని అర్థం. ఇది నేపాల్‌లోని ఖాట్మండ్ లోయలో ఉంది. ఈ ఆలయంలో త్రిమూర్తులలో ఒకడైన శ్రీమహావిష్ణువు... ఆదిశేషుడి పైన శయన మూర్తిగా మనకు దర్శనమిస్తాడు. ఇక్కడున్న విష్ణుమూర్తి విగ్రహం... 5 మీటర్ల పొడవైన రాతిలో చెక్కివుంది. సహజంగా విష్ణువు శయన మూర్తిగా ఒక పక్కకు తిరిగి పడుకొని ఉండే మూర్తుల్ని మనం చూస్తుంటాం. ఇక్కడ మాత్రం స్వామి... వెల్లకిలా పడుకొని, నింగివైపు చూస్తుంటాడు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే... ఇంత భారీ విగ్రహం నీటిలో తేలుతూ ఉంటుంది. భక్తులతోపాటూ... పరిశోధకుల్ని సైతం విశేషంగా ఆకర్షిస్తున్న ఈ విగ్రహం... 1957లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం... 1300 సంవత్సరాల నుంచీ నీటిలో తేలుతోంది.  ఇదంతా దైవశక్తిగా భక్తులు నమ్మితే, పరిశోధకులు మాత్రం... సైంటిఫిక్ కారణం చెప్పలేకపోయారు.
బుల్లెట్ దేవుడు (image credit - wikipedia)

Bullet Deity, Rajasthan:
మన దేశంలో సహజంగా విగ్రహాల్నీ, ఆవుల్నీ, చెట్లనూ, వానరాల్నీ పూజించడం కామనే. బుల్లెట్‌ని దేవుడిలా భావించడం ఎక్కడైనా చూశామా. ఆ వింత గుడి... రాజస్థాన్‌లోని జోధపూర్‌లో ఉంది. ఇక్కడి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను భక్తులు పూజిస్తారు. లిక్కర్‌ను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేస్తే, రోడ్డు ప్రమాదాలు జరగకుండా... దేవుడు కాపాడతాడని ఈ గ్రామస్థుల నమ్మకం. దీని వెనక ఓ నమ్మశక్యం కాని కథ ఉంది. ఈ బైక్ నడిపిన బన్నా... ఈ గుడి ఉన్న ప్లేస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. పోలీసులు బైక్‌ని తీసుకెళ్లి... స్టేషన్‌లో పెట్టుకున్నారు. ఐతే... తెల్లారేసరికి... ఈ బైక్... తిరిగి ప్రమాదం జరిగిన ప్లేస్‌లో కనిపించింది. షాకైన పోలీసులు... మళ్లీ బైక్‌ని తీసుకెళ్లి... ఈసారి గొలుసులతో కట్టేశారు. అయినా అంతే... నెక్ట్స్ డే... ఈ బైక్... ప్రమాదం జరిగిన ప్లేస్‌లోనే ఉంది. ఇలా చాలాసార్లు జరగడంతో... విసుగొచ్చిన పోలీసులు... దీన్ని ఇక్కడే వదిలేశారట. జనం ఈ బైక్‌ని పూజిస్తూ... బుల్లెట్ బాబా గుడి కట్టేశారు.

Hazrat qamar ali darvesh, Maharashtra:
సైన్స్ కారణం చెప్పలేకపోయిన మరో విశేషం... ఓ బండరాయి. మహారాష్ట్ర... శివపురిలోని హజ్రత్ ఖమర్ అలీ దర్వేష్ దర్గాలో ఉంది ఆ స్టోన్. ముంబైకి 16 కిలోమీటర్ల దూరంలో... పుణె శివార్లలో ఆ దర్గా ఉంది. దానికి ఏ ప్రత్యేకతా లేదుగానీ... అక్కడున్న రాయి మాత్రం ప్రపంచ గుర్తింపు పొందింది. కారణం... దానితో ముడిపడివున్న అంతుబట్టని మిస్టరీయే. 90 కేజీల ఆ రాయిని... ఒకవైపు పట్టుకొని ఎత్తడం ఎవరివల్లా కావట్లేదు. అదే 11 మంది కలిసి... చుట్టూ మూగి... చూపుడు వేళ్లతో ఎత్తితే మాత్రం... ఈజీగా లేస్తుంది. ఇలా ఎందుకో సైంటిస్టులు చెప్పలేకపోయారు. ఓ సాధువు... ఇచ్చిన వరం వల్లే ఇలా జరుగుతోందని స్థానికుల నమ్మకం.

Nidhi Van, Uttar Pradesh:
కొన్ని కొన్ని విషయాల్ని నమ్మాలో, వద్దో కూడా అర్థం కాదు. ఇది అలాంటిదే. ఉత్తరప్రదేశ్‌లోని బృదావనంలో ఉంది నిధివనం రంగ మహల్ టెంపుల్. ఈ ఆలయంలోకి రాత్రివేళ రాధాకృష్ణులు వస్తారని, రాసలీలలు ఆడతారని స్థానికుల నమ్మకం. అందుకే... సూర్యాస్తమయం తర్వాత ఈ టెంపుల్‌ని మూసేస్తారు. ఆలయ పరిసరాల్లోకి ఎవ్వర్నీ అనుమతించరు. ఒకవేళ ఎవరైనా రాత్రివేళ టెంపుల్‌లోకి వెళ్తే... వాళ్లు చనిపోతారనీ లేదంటే వాళ్లకు చూపు, మాట, వినికిడి శక్తి పోతుందని ప్రచారం జరుగుతోంది. నిధివనంలో ఉండే చెట్లు... మెలికలు తిరిగి... చిత్రమైన ఆకారాల్లో కనిపిస్తాయి. ఇక్కడి నేలంతా పొడిగా ఉన్నా... ఈ చెట్లు మాత్రం ఏడాదంతా పచ్చదనంతో నిండి ఉంటాయి. వీటిని చూసిన వాళ్లకు సహజంగానే ఈ ప్రదేశం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పటివరకూ రాత్రి వేళ టెంపుల్‌లోకి ఎవర్నీ అనుమతించలేదు. అందువల్ల... నిధివనం మిస్టరీగానే ఉండిపోయింది. దీనిపై బాలీవుడ్‌లో హర్రర్ సినిమాలు కూడా వచ్చాయి.

Jwala devi temple, Himachal Pradesh:
హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లాలో... జ్వాలా దేవి ఆలయం ఉంది. పరమశివుడి భార్య సతీ దేవి ఆలయం ఇది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే... ఆలయ ప్రాంగణలో ఉండే జ్వాల... వందేళ్లుగా వెలుగుతూనే ఉంది. దానికి ఇంధనంగానీ, నూనె గానీ పోయకుండానే... జ్వలిస్తోంది. దీని వెనక ఓ కథ ప్రచారంలో ఉంది. సతీదేవి తండ్రి... శివుణ్ని తిరస్కరించడంతో... మనస్థాపం చెందిన సతీదేవి సూసైడ్ చేసుకుంది. శ్రీమహావిష్ణువు ఆమె దేహాన్ని 51 ముక్కలుగా చేయగా... అవి భూమిపై వేర్వేరు ప్రాంతాల్లో పడ్డాయి. సతీ దేవి నాలిక... ఇక్కడ పడి... అదే జ్వాలగా వెలుగుతోందని స్థానికుల విశ్వాసం. ఈ మిస్టరీని ఛేదించేందుకు చాలా హేతువాద సంస్థలు ప్రయత్నించి చేతులెత్తేశాయి.

Veerabhadra temple, Andhra Pradesh:
ఆంధ్రప్రదేశ్... అనంతపురం జిల్లాలోని లేపాక్షి క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వామి టెంపుల్ కూడా మిస్టరీ లిస్టులో చేరింది. అద్భుతమైన శిల్పకళా చాతుర్యానికి పెట్టింది పేరు ఈ లేపాక్షి టెంపుల్. ఐతే... ఇక్కడి వేలాడే స్తంభం ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ఈ ఆలయంలో 70 స్తంభాలున్నాయి. ప్రాంగణంలో ఉండే ఈ ఒక్కటి మాత్రం 80 శాతం గాల్లో వేలాడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. దీన్ని నిరూపించేందుకు చాలా మంది దీని కింద నుంచీ క్లాత్‌ని పోనిస్తున్నారు. పైన ఎలాంటి సపోర్టూ లేకుండా... భూమిని 20 శాతమే టచ్ చేస్తూ... ఇంత పెద్ద స్తంభం పడిపోకుండా... నిలబడగలగటం... మిస్టరీగా మారింది.

ఇవే కాదు... ఇంకా చాలా ఆలయాల్లో మనకు తెలియని చరిత్ర, సైన్స్ దాగివుంది. అపార సంస్కృతి, చారిత్రక వారసత్వ సంపద మన సొంతం. ఆ ఆలయాల వైశిష్ట్యతను కాపాడటం మనందరి బాధ్యత.

13, జులై 2021, మంగళవారం

Madagascar: స్వర్గానికి బ్రాంచ్ ఆఫీస్! దేవతలకు డెస్టినేషన్! కళ్లు చెదిరే అందాల లోకం! మడగాస్కర్!

మడగాస్కర్

అదో అద్భుత దీవి. కోట్ల సంవత్సరాల కిందట భారత దేశం నుంచీ విడిపోయింది. ఆఫ్రికా ఖండం ఆగ్నేయ భాగాన్ని చేరింది. అక్కడే ఉండిపోయింది. భూమిపై ఎక్కడా లేని చిత్రమైన వాతావరణం, విచిత్రమైన జీవరాసులతో ఆకట్టుకుంటోంది. అదే మడగాస్కర్ దీవి. ఆ దీవి విశేషాలు, ఎందుకు అక్కడ వైవిధ్యభరిత వాతావరణం ఏర్పడిందో తెలుసుకుందాం.

సాధారణంగా దీవుల్లో... చెట్లు, పుట్టలూ తప్ప... ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ ఉండవు. మడగాస్కర్ మాత్రం అలాంటిది కాదు. పశ్చిమ భారతదేశంలోని భౌగోళిక లక్షణాలు... మడగాస్కర్‌లో కనిపిస్తాయి. ప్రపంచంలో మరెక్కడా చూడని ప్రాణికోటి అక్కడుంది. అందుకే అది చాలా హాలీవుడ్ సినిమాలకు షూటింగ్ స్పాట్ అయ్యింది.

విశాల మైదానాలు, దట్టమైన అడవులు, ఎడారులు, అగ్ని పర్వతాలు, రహస్య నదులు, జలపాతాలు, సముద్ర తీరాలు, ఆకాశమంత చెట్లు, అరుదైన జంతుజాలం, మరో ప్రపంచాన్ని తలపించే పర్యావరణం, ఇలాంటి అరవిరిసిన ప్రకృతి అందాల నెలవు మడగాస్కర్.

హిందూ మహాసముద్రంలో ఇదో అద్భుత ద్వీప దేశం. ఆఫ్రికా ఖండానికి ఆగ్నేయ తీరంలో ఉంది. ప్రపంచంలో ఇది నాలుగో పెద్ద దీవి. అందుకే... ప్రపంచంలోని జంతుజాలంలో 5 శాతం ఇందులో ఉన్నాయి. ఈ వైవిధ్యమే ఈ దీవికి ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.

ఈ దీవి ఆవిర్భావం ఓ ప్రకృతి వింత. ఎప్పుడో... 9 కోట్ల సంవత్సరాల కిందట... భారత ద్వీపకల్పం నుంచీ మడగాస్కర్ విడిపోయింది. అది హిందు మహా సముద్రంలో కొట్టుకుపోయి... ఆఫ్రికా ఆగ్నేయ తీరాన్ని చేరింది. కోట్ల సంవత్సరాలు మిగతా ప్రపంచంతో సంబంధం లేకపోవడంతో... ఈ దీవిలో ప్రత్యేక జీవులు పుట్టుకొచ్చాయి. అరుదైన వృక్ష జాతులు పెరిగాయి. అందుకే ఇక్కడ కనిపించే 90 శాతం జీవులు... ప్రపంచంలో మరెక్కడా కనిపించవు.



చరిత్ర:
మిగతా ప్రపంచంలాగే... ఇక్కడా రాచరిక పాలనలు కొనసాగాయి. క్రమంగా... ప్రాచీన హిందువులు............ తూర్పున మలేసియా ద్వీపకల్పం మొదలు... జావా, సుమత్రా దీవుల నుంచి... మడగాస్కర్ వరకు తమ వ్యాపారాన్ని విస్తరించారు. ఓ దేశంగా అవతరించిన ఈ దీవి... 1960లో ఫ్రాన్స్ నుంచీ స్వాతంత్ర్యం పొందింది. ఇక అప్పటి నుంచీ... తన ప్రత్యేకతను చాటుకుంటూ... అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. 2.7 కోట్ల మందికి ఆవాసం కల్పిస్తోంది.

ఆఫ్రికా పక్కనే ఉన్నా... ఈ దీవిలో ఆఫ్రికన్లతో పాటూ... ఆసియన్లూ ఎక్కువే. కారణం మొదటి నుంచీ ఆసియా దేశాలు చేస్తున్న వ్యాపార, వాణిజ్యాలే. తూర్పు ఆసియా దేశాల నుంచీ వచ్చిన చాలా మంది శతాబ్దాలుగా ఇక్కడ స్థిరపడిపోయారు. అందువల్ల ఈ దీవిలో... ఇండొనేసియా సంస్కృతి కనిపిస్తుంది. ఇక్కడ 18 రకాల తెగలు ఉన్నా... అందరూ ఆసియా దేశాల్లో మాట్లాడే... మలగాసీ భాష మాట్లాడతారు. ఇక్కడ భారతీయులు కూడా ఎక్కువే. వీళ్లు హిందీ, గుజరాతీ మాట్లాడతారు.

ఎన్నో వైవిధ్యాలు ఉన్నప్పటికీ... మడగాస్కర్‌లో ప్రధాన వృత్తి వ్యవసాయమే. చాలా ఆఫ్రికా దేశాల్లాగే ఈ దీవి కూడా... పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. ఐతే, జనం మధ్య ఆడా, మగా తారతమ్యాలు ఉండవు. అందరూ కలిసి వ్యవసాయం చేస్తారు. కలిసిమెలిసి జీవిస్తారు. ఎలాంటి గొడవలూ లేకుండా... ప్రశాంత జీవనం సాగిస్తారు.

వ్యవసాయం అంటే... మీకో విషయం చెప్పాలి. ప్రపంచంలోని వెనీలా (vanilla) ఉత్పత్తిలో 80 శాతం వస్తున్నది ఎక్కడి నుంచో తెలుసా? మడగాస్కర్ నుంచే. మనం తినే ఐస్‌క్రీమ్‌లు, చాకొలెట్స్‌లో వెనీలా ఫ్లేవర్ ఉంటుంది. చాలా వంటలు, పెర్‌ఫ్యూమ్ పరిశ్రమల్లో దీన్ని వాడతారు. అరోమాథెరపీకి కూడా వెనీలాను ఉపయోగిస్తారు.

ప్రపంచంలో కుంకుమపువ్వు తర్వాత... అత్యంత ఖరీదైన సుగంధద్రవ్యం వెనీలాయే. కారణం ఈ చెట్ల పెంపకం రిస్కుతో కూడుకున్నది. పువ్వులు పూయడం, కాయలు రావడం, వాటిని ఆరు నెలలు ఎండబెట్టడం, వాటిలో వెనీలా పొడిని సేకరించడం ఇదంతా కష్టమైన పని. 6 కేజీల కాయలతో కేజీ వెనీలా మాత్రమే తయారవుతుంది. కేజీ 40వేల రూపాయలకు పైనే ఉంటుంది. ఈ చెట్ల పెంపకానికి మడగాస్కర్ వాతావరణం చక్కగా సెట్ అవుతోంది. అందుకే ఇక్కడ ఈ వ్యవసాయం పెద్ద ఎత్తున జరుగుతోంది.

ఎన్నో భౌగోళిక ప్రత్యేకతలున్న మడగాస్కర్‌లో నవంబర్ నుంచీ ఏప్రిల్ వరకూ వానలు కురుస్తాయి. మే నుంచీ అక్టోబర్ వరకూ ఎండ దంచికొడుతుంది. హిందూ మహా సముద్రం నుంచీ వచ్చే... తేమ గాలులు... తీర్పు, దక్షిణ తీరాన్ని చల్లబరుస్తున్నాయి. అందుకే ఇక్కడ దట్టమైన అడవులున్నాయి. మిగతా దీవి మొత్తం చిన్నచిన్న అడవులు, ఎడారిని తలపిస్తాయి.

ఈ భూమిపై ఏడు ఖండాలున్నాయని మనం చదువుకున్నాం. కొంతమంది పర్యావరణ వేత్తలు... మడగాస్కర్‌ని ఎనిమిదో ఖండంగా పిలవాలని అంటున్నారు. దీనిపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది. ప్రస్తుతానికి దీన్ని ఎనిమిదో ఖండంగా గుర్తించకపోయినా... ఇదో జీవ వైవిధ్య ప్రాంతంగా... కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ సంస్థ గుర్తించింది. దీనివల్ల... ఈ దీవికి... ప్రత్యేక పర్యావరణ రక్షణ వ్యవస్థలున్నాయి. ఇక్కడి ప్రకృతిని కాపాడేలా... ప్రపంచ దేశాలు నిధులు ఇస్తున్నాయి.

సముద్ర తీరాలు, పచ్చిక బయళ్లు... అన్ని దీవుల్లోనూ కనిపించేవే. మరి మడగాస్కర్ అదనపు ప్రత్యేకత ఏంటి? అన్ని దీవుల్లాగే ఉంటే, మడగాస్కర్ గురించి మనం చెప్పుకోవాల్సిన పనేలేదు. అదేం విచిత్రమోగానీ... చాలా వైరుధ్యాల్ని తనలో దాచుకుంది. కొన్ని ప్రాంతాలకు వెళ్తే... వేరే గ్రహంపై ఉన్నామా అన్న ఫీల్ కలిగిస్తాయి. అలాంటి విభిన్న వాతావరణమే... మడగాస్కర్‌ను అద్భుత దీవిగా మార్చేసింది.

 



మడగాస్కర్‌లో ఎర్రమట్టితో సహజసిద్ధంగా ఏర్పడిన ముళ్లులా కనిపించే ఆకారాలు ఉన్నాయి. సింగీ రోగ్ (Tsingy Rouge) అని పిలిచే ఆ ప్రదేశాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అంకరానా పట్టణానికి దగ్గర్లో ఉంది ఈ ప్రాంతం. భారీవర్షాల వల్ల మట్టి కోసుకుపోయి, ఈ ఆకారాలు తయారయ్యాయి. వేల ఏళ్ళ కిందట ఏర్పడిన ఇవి... ఇప్పుడు కఠినమైన రాతి శిలలుగా మారిపోయాయి. రాళ్లపై ఇసుక పేరుకుపోయి... ఎరుపు రంగులో కనిపిస్తున్నాయి. మడగాస్కర్‌కు వెళ్లిన పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించే ప్రదేశం ఇది.

బాటిల్ లాంటి ఆకారంలో కనిపించే ఈ చెట్లను చూస్తే ఏమనిపిస్తోంది. డైనోసార్ల ప్రపంచం గుర్తొస్తోందా? రైట్. మడగాస్కర్‌ను మరో మెట్టెక్కించాయి ఈ బావోబాబ్ (Baobab) చెట్లు.

బావోబాబ్ చెట్లు ఈ ఒక్కదేశంలోనే కనిపిస్తాయి. వీటిని చూస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది ఎవరికైనా. వీటి మొదళ్ళు ఎంతో లావుగా ఉండి, ఏడెనిమిది మీటర్లు పెరిగిన తర్వాత ఒక్కసారిగా ఆ కాండం నాలుగైదు కొమ్మలుగా విడిపోయి ఆగిపోతుంది. ఆ కొమ్మలు కూడా చాలా చిన్నగా ఉంటాయి. చివర్లలో కొన్ని ఆకులు ఉంటాయి. కాండం ఎంతో నునుపుగా ఉంటుంది. చూస్తుంటే మానవుని చెయ్యి, అయిదు వేళ్ళు విచ్చుకున్నట్లుగా కనిపిస్తుంది.

మడగాస్కర్ దీవికి ఉత్తరాన నోసీ బే (Nosy be) ఉంది. ఈ ప్రాంతంలో అనేక చిన్న చిన్న దీవులున్నాయి. కొన్ని దీవులైతే... కొన్ని అడుగుల వెడల్పే ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ నోసీ బేకి దగ్గర్లోనే నోస్ సకాటియా (Nosy Sakatia), నోసీ టకినేలీ, నోసీ కోంబా, రష్యన్స్ బే, నోసీ ఇరంజా, రదను ద్వీపాలు, నోసీ ఫ్రాలీ, మిట్సియో ఆర్చిపెలాగో వంటివి ఉన్నాయి. అద్భుత సముద్ర తీరాలతో ఈ ప్రాంతమంతా స్వర్గంలా కనిపిస్తుంది.

నోసీ సకాటియా (Nosy Sakatia)ను ఆర్బెడ్ ద్వీపం అంటారు. ఇక్కడ నివసించేది 3వందల మందే. మీకు తెలుసా... ప్రపంచంలో అతి చిన్న ఊసరవెల్లి (chameleon) ఇక్కడే కనిపిస్తుంది. ఈ ఊసరవెల్లి ఒక సెంటీమీటరే ఉంటుంది. రాక్షస గబ్బిలాలు (bats) కూడా ఇక్కడ కనిపిస్తాయి.

నోసీ కోంబా (Nosy Comba) మరో చిన్న ద్వీపం. గుండ్రంగా ఉండి... ఆకాశం నుంచి చూస్తే సముద్రానికి బొట్టుపెట్టినట్లు కనిపిస్తుంది. ఈ ద్వీపంలో మనకు ఫ్లైయింగ్ ఫాక్స్ (Flying Fox) అని పిలిచే రాక్షస గబ్బిలాలు కూడా కనిపిస్తాయి. ఈ ద్వీపంలో ఓ అగ్నిపర్వతం ఉంది. ఇక్కడ లెమర్లు (Lemurs) ఎక్కువగా సంచరిస్తాయి.

రష్యన్ బే కూడా చిన్న ద్వీపం. ఈ దీవిలో పర్యాటకులు రెండు మూడు రోజులు ఉండటానికి వీలుగా హోటళ్ళుంటాయి. ఈ దీవిలోని ప్రకృతి రమణీయతని పూర్తిగా ఆస్వాదించొచ్చు. ఇక్కడ తెలుపు రంగులో మెరిసిపోయే ఇసుక తీరాలున్నాయి. వివిధ జాతుల పక్షులు, జలచరాలు కనిపిస్తాయి. ఈ చిన్న చిన్న దీవుల్ని చూసేందుకు పడవలో గానీ, హెలికాప్టర్‌లో గానీ వెళ్లొచ్చు.

ఇలాంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలతో హాలీవుడ్ యాక్షన్ సినిమా షూటింగ్స్‌కి బెస్ట్ స్పాట్‌గా నిలుస్తోంది మడగాస్కర్. జేమ్స్ బాండ్ సిరీస్‌లో వచ్చిన... కేసినో రాయల్ (Casino Royale)  సినిమాలో ఛేజింగ్ సీన్... ఇక్కడే షూట్ చేశారు. అదే కాదు... మడగాస్కర్ పేరుతో... హాలీవుడ్‌లో యానిమేషన్ సిరీసే ఉంది. మడగాస్కర్‌లో కనిపించే జంతువుల్నే... యానిమేషన్ బొమ్మలుగా చేశారు. ఈ సిరీస్‌లో వచ్చిన సినిమాలన్నీ... ప్రపంచ ప్రేక్షకుల్ని అలరించాయి. మడగాస్కర్‌కు మరింత గుర్తింపు తెచ్చాయి. 




మడగాస్కర్ సఫారీ మజా:
ఎంత పర్యటించినా... మడగాస్కర్‌లో చూడాల్సినవి ఇంకా చాలా ఉంటాయి. అందుకే... అక్కడి ప్రభుత్వం... ఫారెస్ట్ సఫారీ (Madagascar Safari)ని అభివృద్ధి చేసింది. వెహికిల్స్‌పై అలా అలా అడవుల్లో వెళ్తుంటే... ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మాటల్లో చెప్పలేం.

మడగాస్కర్... హరితారణ్యాలకు పెట్టింది పేరు. మనం జాగ్రత్తగా చూడాలేగానీ... ఎన్నో ప్రకృతి అందాలు... అలరిస్తాయి. వెహికిల్‌లో... అడవుల్లో తిరుగుతుంటే... కలిగే మజాయే వేరు. రకరకాల జంతువులు, పక్షులు, వింత వింత చెట్లు... ఎటుచూసినా పచ్చదనం పరచుకొని... మరో లోకానికి తీసుకుపోతాయవి.

పడవల్లో కూడా ప్రయాణిస్తూ... సముద్ర అందాల్నీ, సెలయేర్ల సౌందర్యాన్నీ చూడొచ్చు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లున్నాయి మడగాస్కర్‌లో.

మడగాస్కర్ చుట్టూ సముద్ర నీరు... అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది. లోపల డైవింగ్ చేసేవారికి... రంగురంగుల చేపలతోపాటూ... అరుదైన మత్య్స ప్రపంచం కనిపిస్తుంది.

ఒక్క దీవిలోనే... ఇన్ని రకాల వైవిధ్యభరిత సహజసిద్ధ ప్రకృతి ఉండటం విశేషం. ఎన్ని రోజులు తిరిగినా... ఇంకా చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు మిగిలే ఉంటాయి.

చాలా ఆఫ్రికా దేశాల్లోలా కాకుండా... మడగాస్కర్‌లో శాంతియుత వాతావరణం ఉందంటే దానికి కారణం... పీస్ కీపింగ్ వాలంటీర్లే. ఈ శాంతి సంఘాల సభ్యులు... ఇక్కడి వ్యవసాయం, విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టి... అభివృద్ధిపై జనంలో అవగాహన పెంచుతున్నాయి. పిల్లలందరికీ పౌష్టికాహారం అందేలా చేస్తున్నాయి. మడగాస్కర్ ఇవాళ ఇంత అందంగా ఉందంటే కారణం వీళ్లందరి కృషే.

ఇంత చక్కటి దీవి కూడా... ఈమధ్యకాలంలో దెబ్బతింటోంది. ప్రపంచీకరణ, మానవుల అత్యాశ. అడవుల నరికివేత, గనుల తవ్వకాలు, వన్య మృగాల వేట, కాలుష్యం, విదేశీ సంస్కృతులు... ఇలా ఎన్నో అంశాలు ఈ దీవిని ప్రమాదంలో పడేస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడి మట్టిలో టైటానియం, ఐరన్, కోబాల్ట్, కాపర్, నికెల్ లాంటి ఖనిజాలుండటం ఈ దీవికి శాపమవుతోంది. వాటి కోసం సారవంతమైన భూముల్ని కూడా తవ్వేస్తున్నాయి అంతర్జాతీయ ఖనిజ పరిశ్రమలు.

ఆఫ్రికా దేశాల్లోలాగే... మడగాస్కర్‌లో కూడా 30 ఏళ్లుగా వజ్రాల వేట కొనసాగుతోంది. ఇలకాకా, సకరాహా ప్రాంతాల్లో... పెద్ద ఎత్తున డైమండ్స్ ఇండస్ట్రీ నడుస్తోంది. ఐతే... ఈ పరిశ్రమ వల్ల స్థానికులకు ఒరుగుతున్నది ఏమీ లేదు. శ్రమ దోపిడీ తప్ప... ఆకలి బాధలు తీరట్లేదు. వజ్రాల వ్యాపారులు... స్థానికులతో తవ్వకాలు జరిపిస్తున్నారు. టన్నుల కొద్దీ మట్టిని ప్రాసెస్ చేయిస్తున్నారు. చివరకు దొరికే... నవరత్నాలను... తమ జేబుల్లో వేసుకుంటున్నారు. ఫలితంగా స్థానికుల జీవితాల్లో వజ్రాల మెరుపులు కనిపించట్లేదు.

ఇండియా సహా... ప్రపంచంలో చాలా దేశాలు... కాలుష్యపు కోరల్లో ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా... మనం కాలుష్యాన్ని తగ్గించలేకపోతున్నాం. కనీసం ఇలాంటి దీవులనైనా స్వచ్ఛంగా ఉంచగలిగితే... మానసిక ప్రశాంతత కోసం ఎప్పుడైనా ఓ రౌండ్ వేసి రావడానికి... ఉపయోగపడతాయి.

ఇవీ మడగాస్కర్ విశేషాలు. మీకో విషయం చెప్పనా... మడగాస్కర్‌ను దేవతలు సృష్టించిన స్వర్గంగా స్థానికులు నమ్ముతారు. అంత గొప్ప ద్వీప దేశం అది. అందుకే టూరిస్టులు ఓ వారం పాటూ అక్కడ ఉండి వచ్చేలా ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారు. జీవితాంతం గుర్తుండిపోయే... ఎన్నో అనుభూతులు సొంతం చేసుకుంటున్నారు.

12, జులై 2021, సోమవారం

Time Travel: భూత, భవిష్యత్ కాలాలకు వెళ్లగలమా? ఫ్యూచర్‌లో పుట్టిన వాళ్లు మన మధ్య ఉన్నారా?

భూత, భవిష్యత్ కాలాలకు వెళ్లగలమా?

నడక నుంచీ మొదలైన మన ప్రయాణం... సూపర్ సోనిక్ వేగంతో సాగుతోంది. ఎప్పటికప్పుడు టెక్నాలజీతో అప్‌డేట్, అప్‌గ్రేడ్ అవుతున్నాం. ఐతే... చాలా మంది ఖగోళ శాస్త్రవేత్తలకు తీరని కోరిక ఒకటుంది. అదే టైమ్ ట్రావెల్. ఆదిత్య 369 సినిమాలోలాగా... భూత, భవిష్యత్‌ కాలాల్లోకి ఎలా వెళ్లాలి.... అని సైంటిస్టులు బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారు. మరి టైమ్ ట్రావెల్ సాధ్యమేనా? ఎవరైనా అలా వెళ్లి వచ్చారా? తెలుసుకుందాం.

సైన్స్ ఫిక్షన్లు, చందమామ కథలూ... మనందరికీ ఇష్టమే. ఎందుకంటే అవి మనల్ని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఆ ఊహాలోకంలోకి నిజంగానే వెళ్లగలిగితే... అద్భుతమే. ప్రపంచంలో కొంతమంది.... తాము టైమ్ ట్రావెల్ చేశామని అంటున్నారు. అదెలా సాధ్యమో, వాళ్లు చెబుతున్న విశేషాలేంటో ఓసారి చూద్దాం.

కాలం... అంతులేని అద్భుతాల్ని ఒడిసిపట్టే గాలం. యుగయుగాల దిగంతాల్ని తనలో దాచుకునే సమాహారం. క్షణక్షణం అమూల్యం. గతం ఘనం. వర్తమానం వాస్తవం. భవిష్యత్తు అనూహ్యం. కాల గమనంలో కరిగిపోనిదేది? కాల ప్రవాహంలో కొట్టుకుపోనిదేంటి? అశాశ్వత అనంత లోకాలకు దృశ్యరూప కాంతులద్దే... అదృశ్యశక్తిపుంజమే.... కాలమా?

టైమ్ ట్రావెల్ చేయడాన్ని సినిమాల్లో చూశాం. గ్రాఫిక్స్ మాయాజాలంతో అద్భుతంగా ఉంటాయి ఆ సినిమాల్లో దృశ్యాలు. ఐతే... ఈ ప్రపంచంలో కొంతమంది తాము టైమ్ ట్రావెల్ చేశామంటున్నారు. అందుకు కొన్ని ఆధారాలు కూడా చూపిస్తున్నారు. అవన్నీ నిజాలలాగే అనిపించినా... నమ్మడం మన వల్ల కాదు.

చార్లొట్టే మోబెర్లీ, ఎలియానోర్ జోర్డాయిన్ (Image Credit : Twitter)

Charlotte Anne Moberly and Jourdain: చార్లొట్టే మోబెర్లీ, ఎలియానోర్ జోర్డాయిన్. వీళ్లిద్దరూ 1901లో ఫ్రాన్స్‌లోని పెటిట్ ట్రియానన్ ప్యాలెస్‌కు వెళ్లారు. నిజానికి ఆ ప్యాలెస్‌లో ఎవరూ నివసించట్లేదు. వీళ్లిద్దరికీ మాత్రం అక్కడి గార్డెన్‌లో మరో ఇద్దరు కనిపించారు. ఆ ఇద్దరూ... అచ్చం వీళ్లలాగే ఉన్నారట. షాకైన వీళ్లు... "యాన్ ఎడ్వెంచర్" బుక్‌లో ఈ సంఘటనను వివరించారు. ప్రపంచం ఆశ్చర్యపోయింది. 

పెటిట్ ట్రియానన్ ప్యాలెస్‌ (Image Credit : Twitter)


గార్డెన్‌లో కనిపించిన ఇద్దరూ... 18వ శతాబ్దానికి చెందిన వాళ్లనీ... ప్రస్తుతం దెయ్యాల్లా తిరుగుతున్నారనీ బుక్‌లో రాశారు. ఐతే... 18వ శతాబ్దంలో బతికివున్న వాళ్లిద్దరూ... టైమ్ ట్రావెల్ చేసి... 19వ శతాబ్దంలోకి వచ్చారా? ఇదంతా నిజమేనా? అన్న అనుమానాలకు సమాధానం దొరకలేదు.

ది సర్కస్‌ సినిమాలో సీన్ (Image Credit : Youtube)


Charlie Chaplin's time traveler: 1928లో రిలీజైన చార్లీ చాప్లిన్ సినిమా "ది సర్కస్‌"పై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. ఈ సినిమాలోని ఈ సీన్‌లో... ఎవరో ముసలామె... రోడ్డుపై వెళ్తూ... సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు ఉంటుంది. ఆ కాలంలో సెల్‌ఫోన్లు లేవు కాబట్టి... ఆమె టైమ్ ట్రావెల్ చేసి... గతంలోకి వెళ్లిందా అన్న డౌట్ వచ్చింది. ఆమె ఎవరన్నది తెలియలేదు. దీన్ని చాలా మంది రకరకాలుగా విశ్లేషించారు. ఓ నమ్మదగిన విశ్లేషణ ప్రకారం... ఆ కాలంలో కొత్తగా కనిపెట్టిన చెవిటి మిషన్‌ను ఆమె ఉపయోగిస్తూ ఉండొచ్చని అంచనా కొచ్చారు. టైమ్ ట్రావెలింగ్‌ను నమ్మేవాళ్లు చెవిటి మిషన్ వాదనను ఒప్పుకోలేదు. ఇప్పటికీ ఇది మిస్టరీగానే ఉంది.

టైమ్ ట్రావెల్ చేశాడా (Image Credit : Twitter)


Time Travel Hipster: ఈ ఫొటో చూశారా. 1941 నాటిది. ఇందులో ఓ వ్యక్తి... మిగతా వాళ్లకంటే భిన్నంగా ఉన్నాడు కదా. వాళ్లంతా అప్పటి డ్రెస్ కోడ్‌లో ఉంటే... ఈ ఒక్కడు మాత్రం మోడ్రన్ డ్రెస్‌లో స్పెషల్ సన్ గ్లాసెస్‌తో కనిపిస్తున్నాడు. బ్రిటీష్ కొలంబియాలో ఓ బ్రిడ్జి రీ-ఓపెనింగ్‌కి ఇలా వచ్చాడు. ఇతను 21వ శతాబ్దానికి చెందిన వాడనీ... టైమ్ ట్రావెల్ చేసి... వందేళ్లు వెనక్కి వెళ్లాడని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే... ఆ కాలంలో ఇలాంటి స్టైల్ డ్రెస్సులు లేవు. ఈ ఫొటో నిజమైనదా? మార్ఫింగ్ చేసినదా? అన్న అనుమానాలున్నాయి. నిజమే అయితే... అతనెవరు? గతంలోకి ఎలా వెళ్లగలిగాడన్న ప్రశ్నలకు సమాధానం లేదు.

రుడాల్ఫ్ ఫెంజ్ (Image Credit : Twitter)


Rudolph-Fentz: 1951లో జరిగిందో విచిత్ర ఘటన. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర ఓ కుర్రాణ్ని కారు ఢీ కొట్టింది. అతను అక్కడికక్కడే చనిపోయాడు. అతని డ్రెస్ జేబుల్లో చెక్ చేసిన స్థానికులు షాకయ్యారు. ఎందుకంటే... అతను 1876కి చెందిన రుడాల్ఫ్ ఫెంజ్. అతని దగ్గరున్న ఛార్జీల బిల్లులు, ఇతరత్రా అన్నీ 1876నే చూపిస్తున్నాయి.

న్యూయార్క్ యాక్సిడెంట్ (ఫొటోలో ఉన్నది రుడాల్ఫ్ ఫెంజ్) (Image Credit : Twitter)


1876లో రుడాల్ఫ్ మిస్సింగ్ అయ్యాడు. అతని కోసం చాలా మంది వెతికారు కూడా. అలాంటి వ్యక్తి... 1951లో కనిపించి, యాక్సిడెంట్‌లో చనిపోవడం షాకింగ్ విషయమే.. అంటే అతను... టైమ్ ట్రావెల్ చేసినట్లే. ఇక్కడ అంతుబట్టని విషయమేంటంటే... 1876లో మిస్సింగైనప్పుడు అతను ముసలివాడు. 1951లో అతను 20 ఏళ్ల యువకుడిలా ఉన్నాడు. ఇదెలా సాధ్యమైందన్నది మిస్టరీగా మిగిలిపోయింది.

ఆండ్రూ కార్ల్‌సిన్‌ (Image Credit : Twitter)


Andrew Carlssin: 44 ఏళ్ల ఆండ్రూ కార్ల్‌సిన్‌ ది మరో షాకింగ్ కేసు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో అక్రమాలకు పాల్పడుతున్నాడని... 2003లో ఇతన్ని న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతను 50 వేల రూపాయలతో షేర్లు కొన్నాడు. వాటిని అమ్ముతూ, మళ్లీ కొంటూ.... ఇలా రెండు వారాల్లోనే 2వేల 275 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కి పాల్పడ్డాడంటూ ఇతన్ని అరెస్టు చేశారు. ఇంటరాగేషన్‌లో ఒక్కసారీ ట్రేడింగ్‌లో ఫెయిలవ్వకుండా... ఎలా సక్సెస్ అయ్యావని ప్రశ్నించారు. మతిపోయే సమాధానం చెప్పాడు. తాను ఇప్పటివాణ్ని కాదనీ... ఫ్యూచర్‌కి చెందిన వాణ్ని అని చెప్పాడు. 2256లో తాను పుట్టానని వివరించాడు. టైమ్ ట్రావెల్ చేసి... వెనక్కి వచ్చానని తెలిపాడు. షాకవ్వడం అధికారుల వంతైంది. ఇదే ఓ మిస్టరీ అయితే... ఓ సందర్భంలో బెయిల్ విషయమై ఇతన్ని కోర్టుకు తీసుకెళ్తుండగా... మధ్యలోనే మిస్సయ్యాడు. మళ్లీ కనిపించలేదు.

హకాన్ నార్డిక్విస్ట్ (Image Credit : Twitter)


Hakan Nordkvist: హకాన్ నార్డిక్విస్ట్ కథ మరో రకం. ఇతను 2006 నుంచీ 2046లోకి వెళ్లిపోయాడంట. అదెలా అంటే... కిచెన్‌లో సింక్ బాగుచేస్తూ... అక్కడి ఓ గొట్టంలో దూరాడు. అలా ముందుకి వెళ్లి చూస్తే... ఫ్యూచర్‌ కనిపించిందట. అక్కడ తనలాగే ఉన్న 72 ఏళ్ల వ్యక్తిని కలిశాడు. అతనితో ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఇద్దరి చేతులపైనా ఒకే రకమైన టాటూ ఉండటం వల్ల... తనను తానే కలుసుకున్నానని అంటున్నాడు హకాన్. తన మాటలు ఎవరూ నమ్మకపోయినా... నిజమేంటో తనకు తెలుసంటున్నాడు.

నోవా (Image Credit : Twitter)


Noah Time Travel: అమెరికాలో ఇది మరో ఆశ్చరకర విషయం. 20 ఏళ్ల ఈ కుర్రాడి పేరు నోవా. 2030 నుంచీ 2018కి వచ్చేశాడట. తిరిగి భవిష్యత్తులోకి ఎలా వెళ్లాలో తెలియట్లేదు అన్నాడు. అంతేకాదు... ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అవుతాడనీ... గూగుల్ గ్లాసెస్‌ లాగా పవర్‌ఫుల్ కంప్యూటర్లను మనం కళ్లకు తగిలించుకుంటామనీ, ఫ్యూచరంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే అనీ వివరించాడు. సోలార్ పవర్ వాడకం పెరుగుతుందన్నాడు. ఇలాంటి అంచనాలు మనమూ చెప్పగలం. ట్రంప్ రెండోసారి గెలవలేదు. నోవా మాటల్లో నిజమెంత అన్నది తేలలేదు. తన ఫేస్ కూడా కనిపించకుండా చేసి, తను చెప్పేది మాత్రం నిజమన్నాడు.

ఈ సంఘటనలన్నీ తెలుసుకున్నాక, మీకేమనిపిస్తోంది? టైమ్ ట్రావెల్ సాధ్యమే అనిపిస్తోందా? టైమ్ ట్రావెల్ ఎలా చెయ్యాలన్నదానిపై రకరకాల సిద్ధాంతాలున్నాయి. కొన్ని వాస్తవాల్ని దృష్టిలో పెట్టుకొని చెబితే... కొన్ని పూర్తిగా ఊహలతో రూపొందించినవి. ఎక్కువ మంది చెప్పేది మాత్రం టైమ్ మెషిన్ గురించే. ఆదిత్య 369 సినిమాలోలాగా... టైమ్ మెషిన్‌లో కూర్చుంటే... అదే మనల్ని గతంలోకీ, భవిష్యత్తులోకీ తీసుకుపోతుందని నమ్ముతున్నారు కొందరు శాస్త్రవేత్తలు. ఐతే... అలాంటి మెషిన్‌ను ఇప్పటివరకూ ఎవరూ తయారుచెయ్యలేకపోయారు.

టైమ్ ట్రావెల్ జరగాలంటే... ముందు మనం... కాలం ఎలా గడుస్తోందో మాట్లాడుకోవాలి. సూర్యుడు ఉదయించగానే తెల్లారిందనీ... అస్తమించగానే... ఆ రోజు ముగుస్తున్నట్లుగా మనం భావిస్తాం. 24 గంటల కాలాన్ని ఓ రోజుగా లెక్కేస్తున్నాం. భూమి మీద ఉన్నప్పుడు ఈ లెక్క కరెక్టే. అదే ఏ గురుగ్రహం (Jupiter)పైనో మనం ఉంటే... అక్కడ ఓ రోజు గడవడానికి ఎన్ని గంటలు పడుతుందో తెలుసా? 10 గంటలే.

మరి శుక్రగ్రహం (Venus)పై ఉన్నామనుకోండి. అక్కడ ఒక రోజు గడవాలంటే.. గంటలు కాదు... ఏకంగా 243 రోజులు పడుతుంది. ఎందుకంటే... ఆ గ్రహం తనచుట్టూ తాను అత్యంత నెమ్మదిగా తిరుగుతుంది. చిత్రమేంటంటే... అక్కడ ఒక రోజు గడవకముందే... ఒక సంవత్సరం పూర్తైపోతుంది. అంటే... ఆ గ్రహం తన చుట్టూ తాను ఓ భ్రమణం పూర్తి చేయకముందే... సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగేస్తుందన్నమాట.

దీన్ని బట్టీ మనకు అర్థమయ్యేది ఒకటే. ఈ గంటలు, రోజులు ఇవన్నీ మనం మన భూమిని లెక్కలోకి తీసుకొని పాటిస్తున్నవే. ఒక్కసారి భూమిని దాటి మనం ఆలోచిస్తే... కాలం అన్న పదానికి అర్థమే మారిపోతుంది. గంటలు, రోజులు అన్నింటికీ అర్థాలు వేరవుతాయి.

గతంలోకి ప్రయాణించడమంటే ఏంటి? మనం నిన్నటి కాలంలోకి వెళ్తే... అంటే.. ఓ 24 గంటలు వెనక్కి వెళ్తే... గతంలోకి వెళ్లినట్లే. అదే 24 గంటలు ముందుకి వెళ్తే... భవిష్యత్తులోకి వెళ్లినట్లే. అదేమీ ఒక గదిలోంచీ, మరో గదిలోకి వెళ్లడం కాదు కదా. అందువల్ల అసలు ఎలా వెళ్లాలన్నదే మొదటి ప్రశ్న. దానికి ఆన్సర్ తెలిస్తే... ఎంత గతంలోకి వెళ్లాలో, ఎంత భవిష్యత్తులోకి వెళ్లాలో తేల్చుకోవచ్చు. కానీ... ఎలా వెళ్లాలో చెప్పడం ఏ శాస్త్రవేత్త వల్లా కాలేదు. అసలు కాలం ముందుకి వెళ్తోందా? వెనక్కి వెళ్తోందా? అన్నదే ఓ అంతుబట్టని ప్రశ్న. కాలం అన్నది ఉందా? లేదా? అన్నది కూడా బుర్రను తొలిచేసే ప్రశ్నే.

సినిమాల్లో చూపించినట్లు కాకుండా... నిజంగానే గతంలోకి వెళ్లే ఛాన్స్ ఉంది. అదెలాగో తెలియాలంటే... ముందు... కాలం ఎలా గడుస్తోందో మనం తెలుసుకోవాలి. ఈ విశ్వం, పాలపుంతలు, నక్షత్రాలు, గ్రహాలు... అన్నీ... గతిస్తున్నది కాంతి ప్రవాహంతోనే. అసలీ కాంతే లేకపోతే... ఈ విశ్వమే లేదు. కాంతికి సమయం తోడై... కాలం గడుస్తోందన్న భావన పుట్టింది. అందువల్ల కాంతి వేగమే... భూత, భవిష్యత్, వర్తమానాన్ని సూచిస్తుంది. ఇప్పటికే ప్రవహించేసిన కాంతి గతానికి చెందినది. ప్రస్తుతం ప్రవహిస్తున్నది వర్తమానం. ఇకపై ప్రవహించబోయేది భవిష్యత్తు. అందువల్ల కాంతి కంటే వేగంగా మనం ప్రయాణించగలిగితే... టైమ్ ట్రావెల్ సాధ్యమే.

కాంతివేగం సెకనుకు 2లక్షల 99వేల 792 కిలోమీటర్లు. అంత స్పీడ్‌గా మనం ప్రయాణించాలంటే... గంటకు కోటీ 79లక్షల 87వేల 520 కిలోమీటర్లు వెళ్లాలి. సింపుల్‌గా చెప్పాలంటే... ఇప్పుడు మనం చందమామను చేరడానికి రోజున్నర టైమ్ పడుతోంది. అదే కాంతివేగంతో వెళ్తే... కన్ను మూసి తెరిచేలోపే చంద్రుడిపై ఉండొచ్చు. ఇప్పుడున్న రాకెట్లతో మనకు దగ్గర్లో ఉన్న అంగారక గ్రహాన్ని చేరడానికి 5 నెలలు పడుతుంది. అదే కాంతివేగంతో అయితే.... 3 నిమిషాల్లో మార్స్‌పైకి వెళ్లొచ్చు. మరి కాంతివేగాన్ని మనం అందుకోగలమా? అది సాధ్యమేనా?

కాలంతో ముడిపడిన సాపేక్ష సిద్ధాంతాన్ని చెప్పిన అపరమేధావి ఐన్‌స్టీన్....... ద్రవ్యరాశి గల ఏ వస్తువూ కాంతికన్నా వేగంగా వెళ్లలేదని చెప్పాడు. ఈ సిద్ధాంతం నిజమేనని వేల ప్రయోగాల్లో రుజువైంది. అందుకే ఈ సృష్టిలో కాంతిదే అత్యధిక వేగంగా ఉంది. మనం చెప్పుకుంటున్న నిన్న, నేడు, రేపు అనుకునే కాలానికీ, కాంతి వేగానికీ సాపేక్ష సంబంధం ఉంది. ఈ సృష్టిలో ప్రతీదీ కాంతి, కాలం, కొలతలతో ముడిపడివుంది. కాంతి పయనం, ప్రవాహం వల్లే... కాలం కరిగిపోతున్నట్లు కనిపిస్తుంది. కాంతి పయనానికి సమానంగా మనమూ ప్రయాణిస్తే... అప్పుడు కాల వేగం నెమ్మదిస్తుంది. అంటే... మనం ఏదైనా స్పేస్ షిప్‌లో కాంతివేగంతో ప్రయాణిస్తూ ఉంటే... ఆ టైమ్‌లో మన కాలం దాదాపు స్థిరంగా ఉంటుంది.

కాంతి కంటే వేగంగా మనం ప్రయాణిస్తే... కాలం కుచించుకుపోతుంది. అప్పుడు మనం భవిష్యత్తులోకి వెళ్లి, గతాన్ని చూడగలమన్నది కొందరు శాస్త్రవేత్తల అంచనా. దీన్ని అర్థం చేసుకునేందుకు ఓ ఉదాహరణ ఉంది. అత్యంత సుదూర విశ్వంలో ఏవైనా రెండు నక్షత్రాలు ఢీకొని పేలితే... ఆ పేలుడు కాంతి... మన కళ్లను చేరుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంటే.... ఇప్పుడు మనం అంతరిక్షంలో ఏదైనా పేలుడు కాంతిని చూస్తే... అది ఇప్పుడు కాకుండా ఎప్పుడో పేలినట్లు లెక్క. అంటే గతించిన కాలంలో జరిగిన సంఘటనను ఇప్పుడు మనం కళ్లారా చూస్తున్నామన్నమాట. అంటే మనం గతంలోకి వెళ్లినట్లే అంటున్నారు సైంటిస్టులు.

భూమిపై జరిగే సంఘటనలు కూడా కాంతి రూపంలో అంతరిక్షంలోకి వెళ్తూ ఉంటాయన్నది మరో సిద్ధాంతం. అంటే... వేల సంవత్సరాల కిందట భూమిపై జరిగిన ఘటనలు... ఇప్పటికీ రోదసిలో కాంతి రూపంలో వెళ్తూనే ఉంటాయి. వాటిని మనం కళ్లారా చూడాలంటే... కాంతికంటే వేగంగా ప్రయాణించాలి. ఆ సంఘటనలు ఎంత దూరం ప్రయాణించాయో... అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే... అవి మన కంటికి కనిపిస్తాయి. అంటే మన గతాన్ని మనం చూడగలం. కానీ... దాన్లో ఏ మార్పులూ చెయ్యలేం. ఐతే... ఈ సృష్టిలో కాంతికంటే వేగంగా ఏదీ వెళ్లలేదన్నది ఐన్‌స్టీన్ మాట. అసలు అంతవేగంతో ప్రయాణిస్తే, గామా కిరణాల వల్ల మరణం సంభవిస్తుంది. వాటిని తట్టుకునేంత శక్తి, సామర్ధ్యాలు మనకు లేవు.

స్టీఫెన్ హాకింగ్ (Image Credit : Twitter)


ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్... టైమ్ ట్రావెల్‌పై లోతైన పరిశోధన చేశారు. ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్న చోట... కాలం నెమ్మదిస్తుందని అంచనా వేశారు. ఆ సిద్ధాంతం ప్రకారం... బ్లాక్ హోల్ దగ్గర్లో కాలం వేగం సగానికి తగ్గిపోతుంది. అంటే... అక్కడికి వెళ్లి ఓ 20 ఏళ్లు గడిపితే... భూమిపై అది 40 ఏళ్లతో సమానం. ఐతే... బ్లాక్‌హోల్ దగ్గరకు కాంతివేగంతో వెళ్లినా వేల సంవత్సరాలు పడుతుంది. అన్నేళ్లపాటూ స్పేస్‌షిప్‌లో ఉన్న వాళ్లు బతకడం సాధ్యం కాదు.

అసలీ కాంతితో సంబంధం లేకుండా... మనం ఈ విశ్వంలోంచీ మరో విశ్వంలోకి వెళ్లడానికి వార్మ్ హోల్స్ మార్గం చూపిస్తాయని ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌తోపాటూ చాలామంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. వార్మ్‌హోల్స్ అనేవి... అంతరిక్షంలో షార్ట్ కట్స్ లాంటివి. ఇవి ఒక విశ్వంలోని ఏ ప్రాంతం నుంచైనా మరో విశ్వంలోని మరో ప్రాంతంలోకి క్షణాల్లో వెళ్లిపోయేందుకు వీలు కల్పిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటే వార్మ్‌హోల్స్ టైమ్ మెషిన్లుగా పనిచేస్తాయి. ఇవి విశ్వమంతా వ్యాపించి ఉన్నాయని ఐన్‌స్టీన్ నమ్మాడు. ఇవి ఉన్నాయా లేదా అన్నదే ఓ సమస్య అయితే... వీటిలో ప్రాణం తీసేంత ఎక్కువ రేడియేషన్ ఉంటుందన్నది మరో సమస్య. అందువల్ల వార్మ్‌హోల్‌లో ప్రయాణం ప్రస్తుతానికి ఊహ మాత్రమే.

అంతరిక్ష ప్రయోగాల్లో పోటీపడే రష్యా... విశ్వ రహస్యాల్ని ఛేదించేందుకు... ఓ ప్రాజెక్టు చేపట్టింది. అదే టెలీపోర్టేషన్ (Teleportation). దీని ప్రకారం... మనుషుల్ని కాంతి రూపంలోకి మార్చుతారు. మనిషిలోని అణువులన్నింటినీ వేరు చేసి... వాటిని విశ్వంలోని మరో ప్రాంతానికి చేర్చుతారు. అక్కడ తిరిగి ఆ అణువులన్నీ కలిసి... మానవ రూపం ఏర్పడుతుంది. నిజానికి ఇదో ప్రమాదకర ప్రాజెక్టు. టెలీపోర్టేషన్‌లో సమాచారాన్ని చేరవేస్తే తప్పులేదుగానీ... మనుషుల్ని చేరవేయాలనుకోవడం తప్పంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. చేరవేసేటప్పుడు ఏ చిన్న తేడా వచ్చినా... ప్రాణం పోయినట్లే. అణువులన్నీ తిరిగి మనిషిలా మారినా... ప్రాణం తిరిగొస్తుందన్న గ్యారెంటీ లేదు.

ఇలా కాలంతో టైమ్ ట్రావెల్‌పై చాలా సిద్ధాంతాలున్నాయి. ఒక్కటీ అమలయ్యేలా లేవు. కాంతి వేగాన్ని అందుకోవడమే అసలు సమస్య. సో... టైమ్ ట్రావెల్ అనేది... ఓ పాజిటివ్ ఐడియా మాత్రమే. అది సాధ్యమా, కాదా అన్నది ఇప్పుడే చెప్పలేం. పరిశోధనలూ, ప్రయోగాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.

2, జులై 2021, శుక్రవారం

Machu Picchu: భూమిపై పవిత్ర ప్రదేశం అదేనా? అక్కడ దేవతలు తిరిగేవాళ్లా? 300 ఏళ్లు ఎలా మాయమైంది? అదృశ్య నగరం!

 

మచ్చు పిచ్చు నగరం (image credit - wikipedia)

అదో అద్భుత నగరం. ఎన్నో రహస్యాల స్థావరం. ఎవరు నిర్మించారో, ఎందుకు నిర్మించారో, ఎందుకు వదిలేశారో, ఏం జరిగిందో... ఎవరికీ తెలీదు. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొంది... ప్రపంచ ఆధునిక వింతల్లో ఒకటిగా నిలిచిన మచ్చు-పిచ్చు విశేషాలు తెలుసుకుందాం.

మనం ఓ ఇల్లు కట్టాలంటేనే చుక్కలు కనిపిస్తాయి. అలాంటిది... ఎక్కడో పర్వతాలపై... చక్కగా చదును చేసి... ఓ అద్భుతమైన నగరాన్ని నిర్మించడమంటే మాటలా? అసలు అక్కడికి వెళ్తే.... ఆ సిటీని నిర్మించింది మనుషులేనా అన్న డౌట్ రాక మానదు. చుట్టూ ఆకాశాన్ని అంటినట్టుండే పర్వతాలు.... వాటి మధ్య గంభీరంగా ప్రవహించే నది.... ఆ ప్రదేశం మధ్యలో పర్వతాలపై ఓ నగరం... చరిత్రకారులకు ఎన్నో ప్రశ్నల్ని మిగిల్చి... ఆధునిక మానవాళిని... అంతుబట్టని రహస్యాలతో ఆకర్షిస్తున్న మరో ప్రపంచం. అదే దక్షిణ అమెరికా.... పెరూలోని ఎత్తైన ఆండీస్ పర్వతాల(Andes Mountains)పై ఉన్న మచ్చుపిచ్చు నగరం.

మచ్చు పిచ్చు నగరం (image credit - wikipedia)



దట్టమైన అమెజాన్ అడవి (Amazon Forest)లో ఆండిస్ ప్లేట్‌కు మధ్యలో ఉరుబంబా నది (Urubamba River) ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదికి దాదాపు 8వేల అడుగుల ఎత్తున పర్వతాలపై నగరాన్ని నిర్మించిందెవరు? ఇక్కడే నిర్మించడానికి కారణమేంటి?

ఏ శత్రుదేశాల యుద్ధాల నుంచో రక్షించుకునేందుకు దీన్ని నిర్మించలేదు. ఎందుకంటే ఈ నగరంలో ఎక్కడా కోట గోడలు, యుద్ధ సామగ్రి వంటివి లేవు. వాటికి బదులుగా... ఇక్కడ చిన్న చిన్న ఫౌంటేన్లు, నీటి ప్రవాహాలున్నాయి. అరుదైన ఆలయాలు, వింతైన రాతి ఆకారాలున్నాయి.

ఈ నగరంలో ఎక్కడా శిల్పాలు, శిలా శాసనాల వంటివి కనిపించవు. ఇక్కడి భారీ రాతి కట్టడాలు, ఓ పద్ధతి ప్రకారం చెక్కినట్లుండే టెర్రస్‌లు మాత్రం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తాయి.

2వేల 450 మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ సిటీ... ఓ మిస్టరీ, చారిత్రక అద్భుతం. ఎటు చూసినా గ్రీనరీ, చుట్టూ మంచు కురుస్తూ ఉంటే... అక్కడి నుంచీ విశాల వినీల ఆకాశాన్ని చూడటం ఓ మాటలకందని అనుభూతి.

మచ్చుపిచ్చు అంటే... పాత పర్వతం అని అర్థం. ఇక్కడ చిన్నాపెద్దా... 200 దాకా నిర్మాణాలుంటాయి. దేనికదే విడివిడిగా ఉండేవే. కొన్ని చూడ్డానికి ఇళ్లలా... మరికొన్ని ఆలయాల్లా కనిపిస్తాయి. ఎక్కడ చూసినా... నీటి ప్రవాహాలు దర్శనమిస్తాయి. పైకి ఎక్కడమే కష్టంగా ఉండే ఈ పర్వతాలపై... వీటన్నింటినీ ఎవరు కట్టారు? ఎందుకు?

మచ్చు-పిచ్చు గురించి చారిత్రక ఆధారాలేవీ లేవు. ఏ కవులూ, చరిత్రకారులూ దీన్ని వర్ణించలేదు. ఏ పురాతన గ్రంథాల్లోనూ దీని ప్రస్థావన లేదు. అంతెందుకు... ఇక్కడి ఏ రాయిపైనా ఎలాంటి రాతలూ ఉండవు. నిర్మాణాలు మాత్రం అత్యద్భుతంగా కనిపిస్తూ... పర్యాటకుల్ని కట్టిపడేస్తాయి. ఇంత చక్కటి నగరాన్ని... ఇంతెత్తున... ఎందుకు ఏర్పాటు చేసుకున్నారన్నది ప్రపంచానికే మిస్టరీ.

ముఖ్యంగా మచ్చుపిచ్చులో అత్యంత ఎత్తున ఓ రాతి స్థూపం లాంటి ఆకారం ఉంటుంది. అక్కడకు వెళ్లి చూస్తే... మరో ప్రపంచంలో అడుగుపెట్టిన ఫీల్ కలుగుతుంది. ఆ స్థూపం ఎందుకుంది? ఆ ఆకారానికి అర్థమేంటి? ప్రస్తుతానికి ఇదో అంతుబట్టని రహస్యం.




మచ్చు-పిచ్చుకు సంబంధించి నమ్మలేని కొన్ని నిజాలున్నాయి. మచ్చు-పిచ్చును కళ్లారా చూస్తే... దాని చరిత్ర తెలుసుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది. అంతలా ఆ నిర్మాణాలు... ఆసక్తి రేపుతాయి. అమెరికా సహా ఎన్నో దేశాల పరిశోధకులు... వందేళ్లుగా రహస్యాల్ని ఛేదిస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో ఎన్నో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.

మచ్చు-పిచ్చును ఎవరు నిర్మించారు? వందేళ్లుగా ఇదో మిస్టరీ. 14వ శతాబ్దంలో ఇన్కా జాతి (Incas) చక్రవర్తులు... పెరూను పరిపాలించారు. వాళ్లే మచ్చు-పిచ్చును నిర్మించి ఉంటారనే అంచనాలున్నాయి. ఎందుకంటే... మచ్చు-పిచ్చు లాంటి నిర్మాణాలు పెరూలో చాలాచోట్ల ఉన్నాయి. పొడవాటి మెట్లు, కాలువలు, రాతి ఆకారాల వంటివి... మచ్చు-పిచ్చును పోలి ఉంటాయి. ఐతే... అవేవీ... మచ్చు-పిచ్చు అంత అద్భుతంగా మాత్రం ఉండవు. మచ్చు-పిచ్చులో లాగే... పెరూలోని నిర్మాణాల్లో ఎక్కడా ఇనుమును వాడలేదు. చక్రాలతో పనిలేకుండానే  నిర్మించారు. ఏ శిలలపైనా రాతల్ని రాయలేదు.

ఇన్కాన్ల చరిత్రను అప్పటి పోమా అనే రచయిత... తన గ్రంథాల్లో రాశాడు. నగరాల్ని ఎలా నిర్మించేవాళ్లో ఆయన బొమ్మల రూపంలో రాశాడు. ఆ ఆధారాల్ని బట్టి... ఇన్కాన్లు... రకరకాల జాతుల్ని ఏకం చేసుకుంటూ... దక్షిణ అమెరికా పశ్చిమాన.... దాదాపు 4వేల కిలోమీటర్ల పరిధిలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. దీన్నే కుస్కో (cusco city of peru) అని పిలిచేవాళ్లు.

ఇన్కాన్లు... పెద్ద పెద్ద కొండల్ని కూడా చెక్కుతూ... వ్యవసాయం చేసేవాళ్లు. చక్రవర్తికి తిరుగులేని అధికారాలుండేవి. ఆయన మాట శిలా శాసనంగా అమలయ్యేది. అందువల్ల పరిపాలనలో ఎలాంటి వివాదాలూ ఉండేవి కావు. చిత్రమైన విషయమేంటంటే... ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సంపాదించుకున్న ఇన్కాన్లు... పరిపాలన సాగించింది కేవలం వందేళ్లే.

15వ శతాబ్దంలో... స్పెయిన్ చక్రవర్తులు... కుస్కోపై వరుస దండయాత్రలు చేశారు. ఆ యుద్ధాల్లో కుస్కో ఛిన్నాభిన్నమైంది. ఆర్థికంగా పతనమైంది. కరువుకాటకాలకు, ఆకలి బాధలు తోడై... కుస్కో కకావికలమైంది. అదే సమయంలో... వచ్చిన మసూచి (Smallpox)... కుస్కో ప్రజల పాలిట శాపమైంది. 1572లో కుస్కో... స్పెయిన్ చక్రవర్తుల వశమైంది.

ఇన్కా చక్రవర్తుల్లో చివరివాడైన పచ్చక్యూటీ (pachacuti)... 35 ఏళ్లపాటూ పరిపాలించాడు. ఆ కాలంలో ఆయన... విల్కబాంబ (vilcabamba) అనే ఓ నగరాన్ని ఎత్తైన పర్వతాల మధ్యలో నిర్మించాడు. అక్కడి నుంచే పరిపాలన సాగించాడు. కుస్కో పూర్తిగా స్పెయిన్ చక్రవర్తుల వశమైన తర్వాత... విల్కబాంబ నగరం ఒకటుందన్న సంగతి అందరూ మర్చిపోయారు. అలా ఇది చరిత్రలో అదృశ్యమైంది.

350 ఏళ్ల తర్వాత విల్కబాంబ మళ్లీ వెలుగులోకి వచ్చింది. 1911లో అమెరికా పరిశోధకుడు హిరమ్ బింగమ్... ఓ నగరాన్ని గుర్తించాడు. జులై 24న పర్వతాలపైకి ఎక్కి... అక్కడి నిర్మాణాలను ఫొటోలు తీశాడు. అలా దాని గురించి ప్రపంచానికి తెలిసింది. ఆ నగరాన్ని ఆయన మచ్చు-పిచ్చు అని పిలిచాడు. అప్పటి నుంచీ మచ్చు-పిచ్చు ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది. ఐతే... తను కనుక్కున్నది విల్కబాంబ అని ఆయనకు తెలీదు.

బింగమ్ టీమ్... అక్కడ పురావస్తు పరిశోధనలు జరపగా... ఓ ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. మచ్చు-పిచ్చు దగ్గర కనిపించిన పుర్రెల్లో... 80 శాతం బాలికలవే. ఒక రకంగా ఆ నగరం... బాలికల శవాల దిబ్బలా అనిపించింది వాళ్లకు. ఆ బాలికలను చంపిందెవరు? ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతగ్గా... ఓ విషయం తెలిసింది. ఇన్కా చక్రవర్తులు... బాలికల్ని బానిసలుగా చేసుకునేవాళ్లు. 8 ఏళ్ల వయసులోనే వాళ్లను తమ సేవకులుగా మార్చుకునేవాళ్లు.

1913లో రిలీజైన ఓ పుస్తకం కొత్త విషయం చెప్పింది. స్పెయిన్ చక్రవర్తులు... ఇన్కాన్ల అన్ని ఆలయాల్నీ నాశనం చేశారు. మచ్చు-పిచ్చును మాత్రం టచ్ చేయలేదు. దాని గురించి వాళ్లకు తెలియలేదా? లేక... తెలిసి కూడా దాని జోలికి రాలేదా? అన్న ప్రశ్నలకు ఆన్సర్ దొరకలేదు.


మచ్చు పిచ్చు నగరం (image credit - wikipedia)



మచ్చు-పిచ్చుకి సంబంధించి... భయంకరమైన విషయం ఒకటుంది. ఎన్నో మిస్టరీల కలయిక మచ్చు-పిచ్చు. వాటికి సమాధానాలు వెతికేందుకు వందేళ్లుగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఇంతకీ మచ్చు-పిచ్చు ఎలాంటి ప్రదేశం? సైనిక స్థావరమా? లేక... ప్రార్థనా కేంద్రమా? పురావస్తు పరిశోధకులకు తెలిసిన భయంకరమైన విషయమేంటి?

మచ్చు-పిచ్చును ఎందుకు నిర్మించారన్నది ఇప్పటికీ తేలని విషయమే. ఐతే... కొన్ని అంచనాలు మాత్రం ఉన్నాయి. మచ్చు-పిచ్చులో చాలా ఆలయాల వంటి నిర్మాణాలున్నాయి. వాటిలో 3 కిటికీల గది ఆలయం, సూర్య ఆలయం, ఇంటి వతానా రాతి స్థూప ఆలయం (inti watana) ప్రసిద్ధి చెందాయి. ఇన్కాన్లు.... సూర్యుడు, నదులు, పర్వతాల్ని దేవతలుగా భావించేవాళ్లు. దేవతల్ని సంతృప్తి పరిచేందుకు వాళ్లు... ఆడపిల్లల్ని బలి ఇచ్చేవాళ్లు. అందువల్ల తమకు అద్భుతమైన శక్తులు వస్తాయని నమ్మేవాళ్లు. ఇన్కాన్ల చివరి రాజైన పచ్చక్యూటీ... వందల మంది ఆడ పిల్లల్ని బలి ఇచ్చినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. అందుకే అక్కడ ఆడపిల్లల పుర్రెలే ఎక్కువగా కనిపించాయని నమ్ముతున్నారు.



ఇన్కాన్లకు మరో లక్షణం కూడా ఉంది. చనిపోయిన వారిని వాళ్లు మమ్మీలుగా మార్చేవాళ్లు. వాళ్లను దేవతలుగా పూజించేవాళ్లు. పచ్చక్యూటీ 1472లో చనిపోగా... అతన్ని కూడా మమ్మీగా మార్చేశారు. ఇప్పటికీ... పెరూలో జరిగే ఉత్సవాల్లో... మమ్మీలను ఊరేగించే ఆచారం ఉంది.

500 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న మచ్చు-పిచ్చును... వాతావరణమే దెబ్బతీస్తోంది. ఇక్కడ ఏటా అక్టోబర్ నుంచీ ఏప్రిల్ వరకూ... భారీ వర్షాలు కురుస్తాయి. ఫలితంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి.

ఒకప్పుడు పర్యాటకులు మచ్చు-పిచ్చును చేరాలంటే... 4 రోజులు పట్టేది. ఇప్పుడు ట్రైన్, బస్సు రూట్ల ద్వారా 4 గంటల్లోనే చేరగలుగుతున్నారు. మచ్చు-పిచ్చులో అన్నింటి కంటే ఎత్తులో ఉండే... ఇంటి వతానా శిలా స్థూప ఆలయం ఎక్కువమందిని ఆకర్షిస్తోంది. కారణం... ఈ స్థూపం... చుట్టూ నాలుగు దిక్కుల్లో ఉన్న ఎత్తైన పర్వత శిఖరాగ్రాలతో లింక్ అవుతున్నట్లుగా ఉంటుంది. నలుగురు శక్తిమంతమైన దేవతల మధ్య... నదీమ తల్లి ప్రవాహం సాగుతుండగా... అక్కడ నిర్మించిన మచ్చు-పిచ్చును అత్యంత పవిత్రమైనదిగా భావించేవాళ్లు ఇన్కాన్లు.

ఇది ప్రార్థనా ప్రదేశమా, లేక సైనిక స్థావరమా అన్నది ఇప్పటికీ మిస్టరీయే. తాజాగా పరిశోధనల ప్రకారం... కొత్త విషయాలు తెలిశాయి. ఇన్కాన్ల చివరి రాజైన పచ్చక్యూటీ ప్రత్యేక ఆసక్తితో మచ్చు-పిచ్చూను నిర్మించుకున్నాడు. ప్రశాంతత, దైవత్వానికి చిహ్నంగా ఈ నగరాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఐతే... పచ్చక్యూటీ చనిపోయిన తర్వాత... ఈ నగరంలో జనం... మసూచి సోకి చనిపోయి ఉంటారని ఓ అంచనా.

మచు పిచ్చును ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది యునెస్కో. 2007లో వరల్డ్ న్యూ సెవెన్ వండర్స్‌లో ఇది కూడా ప్లేస్ సంపాదించుకుంది. ప్రస్తుతం వరల్డ్ బెస్ట్ టూరిస్ట్ స్పాట్‌లలో ఇదీ ఒకటి. ఇక్కడ టూరిస్ట్ ప్యాకేజీలు, హోటల్, ప్రయాణ ఖర్చులు చాలా తక్కువగా ఉండటంతో... ఎక్కువ మంది పర్యాటకులు దీన్ని చూసేందుకు వెళ్తున్నారు.

రోబో సినిమాలో... కిలీమంజారో సాంగ్ షూటింగ్ ఇక్కడే జరిగింది. ఐతే... మన కేంద్ర ప్రభుత్వం కోరితే తప్ప... ఇక్కడ షూటింగ్ జరిపేందుకు అనుమతి ఇవ్వలేదు పెరూ ప్రభుత్వం. అంతలా... ఈ నగరాన్ని కాపాడుతున్నారు అధికారులు.



మచ్చు-పిచ్చును నిర్మించడానికి కారణాలు ఏవైనా కావచ్చు. బట్... అదో అద్భుతమైన చారిత్రక నగరం. ఆధునిక ప్రపంచానికి సరికొత్త అనుభూతులను మిగిల్చే... వింత ప్రదేశం. రకరకాల రహస్యాలే ఆ నగరానికి ప్రత్యేక ఆకర్షణలు. అవే... పర్యాటకులు తరలివచ్చేలా చేస్తున్నాయి.


 

1, జులై 2021, గురువారం

Atacama: అద్భుతాల అటకామా!

అటకామా ఎడారి (image credit - wikipedia)

Atacama Desert: ఈ భూమిపై అదో చిత్రమైన ప్రదేశం. ఎన్నో పరిశోధనలకు నిలయం. అంతరిక్ష అద్భుతాల్ని ఆవిష్కరించే నవ లోకం. అరుదైన పూల జాతులకు కేరాఫ్ అడ్రస్. అదే అటకామా ఎడారి. దాని ప్రత్యేకతలేంటో ఇవాళ్టి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అలాగే... 2017వ సంవత్సరంలో అక్కడ జరిగిన ఓ అద్భుతాన్ని కళ్లారా చూద్దాం.

ఎటు చూసినా ఎర్రటి మట్టి దిబ్బలు. కొండల్ని తలపించే ఇసుక తిన్నెలు. ఆకట్టుకునే ఆండీస్ పర్వతాలు. అత్యంత అరుదైన ఎడారి ప్రాణులు. సలసలా కాగే వేడి నీటి బుగ్గలు. కట్టిపడేసే అంతరిక్ష అందాలు. అక్కడ కాలు పెడితే... సుర్రున కాలుతుంది. భరించలేని ఎండ... దిమ్మ తిరిగేలా చేస్తుంది. అయినప్పటికీ... అటకామా ఎడారికి... మన ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం ఉంది. జీవ వైవిధ్య భరిత ప్రత్యేకతలతో ఆకట్టుకుంటుంది అటకామా ఎడారి.

దక్షిణ అమెరికాలో ఆండీస్ పర్వతశ్రేణికి పశ్చిమాన... సన్నటి భూభాగంలో ఉంది ఈ ఎడారి. వెయ్యి కిలోమీటర్ల పొడవున ఇది విస్తరించి ఉంది. ఇక్కడ సంవత్సరంలో ఒక్క రోజు కూడా వాన పడదు. అందుకే ప్రపంచంలో అత్యంత పొడి ప్రదేశం ఏదంటే ఆన్సర్ అటకామాయే. ఎక్కడికి వెళ్లినా వేడి వాతావరణమే. పగటి వేళల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల దాకా ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం ఎడారిలో తిరిగితే... ప్రత్యక్ష నరకమే. మిగతా ఎడారులలాగే... ఇక్కడ కూడా... రాత్రి కాగానే... ఉష్ణోగ్రత 5 డిగ్రీలకు పడిపోతుంది. విపతీరమైన చలి వేసేస్తుంది.

ఈ ఎడారి అత్యంత పురాతనమైనది. దీని వయసు 20 కోట్ల సంవత్సరాలు. కాలిఫోర్నియాలో డెత్ వ్యాలీ కంటే ఇది 50 రెట్లు ఎక్కువ పొడిగా ఉంటుంది. ఉత్తర చిలీలో విస్తరించి ఉన్న ఈ డెసెర్ట్‌లో ఎక్కువ భాగం సాల్ట్ బేసిన్‌లు, ఇసుక, లావా రాళ్ళే ఉంటాయి. అటకామాలోకి ఎంటరైతే... మరో ప్రపంచంలోకి వెళ్లినట్లే. పసిఫిక్ తీర ప్రాంతాలు, చిలీలో తప్పితే... ఇక్కడ మనుషులెవ్వరూ కనిపించరు. చెట్టూ-చేమా ఉండవు.
 
పొడి వాతావరణం వల్ల... ఇక్కడ నివసించే జంతువులు, పక్షులు చాలా తక్కువ. బల్లులు, పురుగులు, తేళ్లు మాత్రమే ఉంటాయి. ఐతే... ఆండీస్ పర్వత శ్రేణుల దగ్గర్లో ఉండే... శాన్ పెడ్రో డీ అటకామా (San Pedro de atacama) పట్టణంలో మాత్రం... కొన్ని రకాల జంతువులు, పక్షులు ఉంటాయి. ముఖ్యంగా... ఆండియన్ ఫ్లెమింగోలు (Flamingo)... పద్ధతిగా కదులుతూ... కెమెరాలకు పని పెడతాయి. వాటిని చూస్తుంటే... టైమే తెలీదు.

మలమలా మాడే ఈ ఎడారిలో... పర్యాటక ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. వాటిని చూసేందుకు వచ్చే టూరిస్టులు... శాన్ పెడ్రో డీ అటకామా పట్టణంలో స్టే చేస్తారు. చిలీలోని మూడు ప్రధాన పర్యాటక కేంద్రాల్లో అటకామా ఎడారిదే టాప్ ప్లేస్. దీంతోపాటూ... శాన్ పెడ్రో డీ అటకామా పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో వేడి నీటి బుగ్గలుంటాయి (Geysers). చుచు టౌన్‌లో ఉన్న మొత్తం 80 గీజర్లను చూసేందుకు పర్యాటకులు తరలివెళ్తారు. అటకామాలో రెగ్యులర్‌గా... వోల్కనో మారథాన్‌లు జరుగుతుంటాయి. అసలే ఎండ... చుక్క నీరుండదు... అలాంటి చోట... ఇసుక దిబ్బల్లో పరుగెత్తడమంటే మాటలా. అందుకే ఈ మారథాన్‌లో గెలవడాన్ని ఓ ఛాలెంజ్‌గా తీసుకుంటారు పార్టిసిపెంట్స్.



అటకామాకీ, అంగారక గ్రహానికీ ఉన్న సంబంధమేంటి?
అటకామా ఓ ఎడారి దిబ్బ. అది మనకు ఎందుకూ పనికిరాదు... అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే... అటకామాలో అపార ఖనిజ సంపద ఉంది. అంతేకాదు... అంతరిక్ష పరిశోధనలకు ఆ ఎడారిని మించిన ప్రాంతం... ఈ భూమిపైనే లేదు. ఎందుకో తెలుసుకుందాం.

అటకామాను చూసిన వాళ్లకు... అంగారక గ్రహం గుర్తురావడం సహజం. ఎందుకంటే... రెడ్ ప్లానెట్‌ లాగే... ఈ ఎడారి కూడా... ఎరుపు రంగులో కనిపిస్తుంది. పైగా... మార్స్‌పై ఎలాంటి వాతావరణం ఉందో... అటకామాలో కూడా... అదే రకమైన వాతావరణం, అలాంటి మట్టి రేణువులే ఉన్నాయి.

మార్స్ ఇతివృత్తంతో తీసే సినిమాల షూటింగ్స్‌లో ఎక్కువ శాతం అటకామా ఎడారిలోనే జరుగుతున్నాయి. "స్పేస్ ఒడిస్సీ - వోయాజ్ టు ది ప్లానెట్స్" లాంటి టీవీ సిరీస్‌లు కూడా... ఇక్కడే షూట్ చేస్తున్నారు. (Space Odyssey)

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ- నాసా (NASA)... తన ల్యాండ్ రోవర్ల (NASA rovers)ను ఇక్కడ పరీక్షిస్తోంది. ఈ నేలపై సక్సెస్‌ఫుల్‌గా నడవగలిగే రోవర్లు... చందమామ, మార్స్‌పై కూడా తిరగగలుగుతున్నాయి.

ఎత్తైన ప్రదేశంలో ఉండటం, మేఘాలు లేని ఆకాశం, పొడి గాలి, కాంతి కాలుష్యం లేకపోవడం, సిటీల నుంచీ రేడియో తరంగాల ధ్వని రాకపోవడంతో... అటకామా ఎడారి... విశ్వాన్ని శోధించేందుకు చక్కగా ఉపయోగపడుతోంది. ఇక్కడ ఏడాదికి 300 రోజులు ఆకాశం అత్యంత నిర్మలంగా ఉంటుంది. రాత్రి వేళ ఆకాశంలో కనిపించేది... అద్భుతమే. కోట్ల నక్షత్రాలతో మన పాలపుంత (Milkyway Galaxy) మిలమిలా మెరుస్తూ మాటలకందని దృశ్యరూపాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ భూమ్మీద మరెక్కడా... ఇంత చక్కగా, ఇంత స్పష్టంగా విశ్వం కనిపించదన్నది అంతరిక్ష పరిశోధకుల మాట.



నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు... ఇక్కడ అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నాయి. యూరప్ దక్షిణ పరిశోధనా శాఖ ఇక్కడ రెండు భారీ రీసెర్చ్ సెంటర్లను... నిర్వహిస్తోంది. ఈ రెండు కేంద్రాల్లో భారీ టెలిస్కోపులు ఉన్నాయి. వీటిలో అల్మా (Alma Telescope) అని పిలిచే టెలిస్కోప్.. ప్రపంచంలోనే అతి పెద్దది.

ఇవి... విశ్వాన్ని నిరంతరం జల్లెడ పడుతున్నాయి. గ్రహశకలాల రాకపోకలు, గ్రహాల కదలికలు, నక్షత్ర మండలాల్ని ఇవి ప్రతీ క్షణం గమనిస్తున్నాయి. 2011లో అటకామా లార్జ్ మిల్లీమీటర్ ఎర్రే పేరుతో... మరో టెలిస్కోపును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో యూరప్, జపాన్, అమెరికా, కెనడా, చిలీ భాగస్వాములు. వీటితోపాటూ ఇక్కడ 66 రేడియో రోదసీ టెలిస్కోపులు 1999 నుంచీ పనిచేస్తున్నాయి. ఇవి నక్షత్రాల నిర్మాణాన్ని పరిశీలిస్తున్నాయి.

పర్యావరణ పరంగా అటకామాలో పచ్చదనం లేదుగానీ... అపార ఖనిజ సంపద మాత్రం ఈ డెసెర్ట్ సొంతం. 16, 17, 18 శతాబ్దాల్లో ఇక్కడ తీర ప్రాంత నగరాలు ఏర్పడ్డాయి. ఈ భూమిలో సిల్వర్, కాపర్, గోల్డ్, సోడియం నైట్రేట్ వంటి ఖనిజ నిక్షేపాలు ఉండటం వల్ల గనుల పరిశ్రమ స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.

ప్రపంచానికి సోడియం నైట్రేట్ ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నది ఇక్కడి నుంచే. దీనితోనే ఎరువుల్ని, పేలుడు పదార్థాల్నీ తయారుచేస్తారు. మన సెల్‌ఫోన్లు, ఇతర బ్యాటరీలకు అవసరమయ్యే ముడి పదార్థాల్ని ఎక్కువగా అందిస్తున్నది అటకామాయే.

1940లో చిలీ సాల్ట్‌పీటర్ అనే ప్రాంతంలో... సోడియం నైట్రేట్ తవ్వకాలు ఎక్కువగా జరిగాయి. ఫలితంగా ఇక్కడ తవ్వి వదిలేసిన గనులు, కార్మికులు లేని శిథిల పట్టణాలూ కనిపిస్తాయి. ఒక్క మనిషీ లేకుండా... ఖాళీగా ఉండే ఇళ్లు... పర్యాటకులకు ఆశ్చర్యం కలిగిస్తాయి.

అటకామాలో ఐదేళ్ల కిందట... ఓ గనిలో ప్రమాదం జరిగి... 33 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. వాళ్లందర్నీ ప్రాణాలతో రక్షించగలిగారు. అదే స్టోరీలైన్‌తో హాలీవుడ్ సినిమా The 33 వచ్చింది. దాన్ని అటకామాలోనే షూట్ చేశారు.

అటకామాలో మరో ప్రత్యేకత... ఇక్కడ దొరికిన మమ్మీలు. ఒకప్పుడు ఇక్కడ చించొర్రో జాతి జాలర్లు నివసించేవాళ్లు. వీళ్లు చనిపోయిన వాళ్లను మమ్మీలుగా మార్చేవాళ్లు. శవాల్ని అత్యంత భద్రంగా దాచేవాళ్లు.

ఈజిఫ్టులో కంటే... వేల సంవత్సరాల ముందు నుంచే... ఇక్కడ మమ్మీల సంస్కృతి ఉంది. ఈజిఫ్టులో కనిపించిన అతి పురాతన మమ్మీ క్రీస్తు పూర్వం 3వేల సంవత్సరాల నాటిదైతే.... అటకామాలో దొరికిన పురాతన మమ్మీ క్రీస్తుపూర్వం 7వేల 20 నాటిది.



అటకామాలో 2017 సంవత్సరం ఓ అద్భుతం జరిగింది. అదేంటో తెలుసుకుందాం.

మనం ముందే చెప్పుకున్నాం... అటకామాలో వర్షం అన్నదే పడదని. ఐతే... కొన్నేళ్లుగా అక్కడి వాతావరణంలో మార్పులొస్తున్నాయి. 2015లో వాన పడి వరదలు రాగా... 2017 మళ్లీ అలాగే జరిగింది. ఇదో శుభ పరిణామం. ఐతే... వర్షం వల్ల అక్కడో అద్భుతం జరిగింది. అటకామా ఎడారి పూల తోటలతో నిండిపోయింది. చుక్క నీరు కూడా ఉండని ఎడారిలో... కలర్‌ఫుల్ ఫ్లవర్స్ రావడం అద్భుతమనే చెప్పాలి. ప్రకృతి కరుణించడం వల్లే.. ఇది సాధ్యమైంది. మట్టి దిబ్బలా కనిపించే అటకామాలో మాయాజాలం చేసినట్లు అయ్యింది. 2018లో చిలీలో తుఫాను రాకతో... భారీ వరదలొచ్చాయి. ఏకంగా ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయేంత పరిస్థితి. వాతావరణంలో వచ్చిన మార్పు... ఆండీస్ పర్వతాలపై ప్రభావం చూపింది. అక్కడి నుంచీ వచ్చిన పొగమంచు.... ఎడారి వాతావరణాన్ని చల్లబరిచింది. ఉన్నట్టుండి... ఇక్కడ మంచు వాన పడటంతో... ఎడారి కాస్తా... పూలవనంగా మారిపోయింది. ఎటుచూసినా... రంగురంగుల పూలతో నిండిపోయింది. 

పూలతో అటకామా ఎడారి (image credit - wikipedia)

సాధారణంగా... అటకామాలో... పదేళ్లలో ఒక్కసారే ఇలాంటి వాతావరణం కనిపిస్తుంది. గత దశాబ్దంలో సీన్ మారింది. 2015లో భారీ వర్షాలు రాగా... రెండేళ్లకే మళ్లీ కురవడం... అటకామాలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. దాదాపు 200 రకాల పూల మొక్కలు అక్కడ కనిపించాయి. ఎడారిలోనే కాదు... అగ్ని పర్వతాలపై, కొండలపై, ఇసుక తిన్నెలపై... అంతటా అవి పరచుకున్నాయి. వీటిని చూసేందుకు రోజూ వేల మంది పర్యాటకులు తరలివెళ్లారు. పూల మొక్కలతోపాటూ... కొన్ని రకాల ఎడారి మొక్కలు, ఔషధ మొక్కలు కూడా కనిపించాయి. వాటిని కనిపెడుతూ... తమ కెమెరాల్లో బంధించారు పర్యాటకులు.



సాధారణంగా... ఈ ఎడారిలో పిడుగులు ఎక్కువగా పడుతుంటాయి. అవి చేసే శబ్దాలు ఎలా ఉంటాయంటే... ఈ ప్రపంచం అంతమైపోతోందా అన్న డౌట్ కలిగిస్తాయి. అలాంటి చోట... ఈ పూలు పలకరించడం పర్యావరణానికే సరికొత్త శోభ అనుకోవచ్చు. ఎప్పుడో 20 ఏళ్ల కిందట... ఇలాగే పూల మొక్కలొచ్చాయి. మళ్లీ 2017లో కనిపించాయి. ఈ వాతావరణ మార్పుల్ని పర్యావరణ వేత్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు. కనీసం రెండేళ్లకోసారైనా వర్షాలు పడితే... అటకామాను సుందర ప్రాంతంగా మార్చేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. 2017 నవంబర్ తర్వాత అటకామా మళ్లీ ఎడారిలా మారిపోయింది.

ఇదీ అటకామా వాస్తవ చిత్రం. ప్రకృతి తలచుకుంటే ఏమైనా చేయగలదు. అందుకే... ఎడారిలో కూడా పూల వర్షం కురిసింది. పర్యాటకులకు ఆహ్లాదం... ప్రాణికోటికి ఆహారం అందించింది.