6, మార్చి 2024, బుధవారం

How insects fly in running Train?- కదులుతున్న రైల్లో పురుగులు ఎలా ఎగరగలుగుతున్నాయి?

 


జనరల్‌గా మనందరికీ బస్సులో జర్నీ కంటే, రైలు ప్రయాణం నచ్చుతుంది. ఎందుకంటే.. బస్సులు సిటీల్లో వెళ్తుంటాయి. రైళ్లు మాత్రం పచ్చిక బయళ్లు, కొండలు, ప్రకృతిలో వెళ్తుంటాయి. కిటికీ పక్కన కూర్చొని, అలా చూస్తుంటే, చెట్లు, ఇళ్లు, పొలాలూ అన్నీ వెనక్కి పారిపోతున్నట్లు కనిపిస్తాయి. ఆ ప్రయాణం కొంత ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఐతే.. మీరెప్పుడైనా కదిలే రైల్లో ఈగలు, దోమలు, లైట్ పురుగులు ఎలా ఎగరగలుగుతున్నాయో ఆలోచించారా?


దోమలు, ఈగలతో పోల్చితే రైలు వేగం చాలా ఎక్కువ. కానీ ట్రైన్‌లో పురుగులు స్వేచ్ఛగా ఎగురుతాయి. అంటే, రైలు వేగంతో సమానంగా అవి ఎగురుతున్నట్లే. ఇది ఎలా సాధ్యం?


దీనికి కారణం స్థిరమైన వేగంతో ఉండే గాలి. అంటే.. రైలులో లేదా కారులో లేదా విమానంలో అన్ని డోర్లూ మూసివేశాక.. అవి వేగంగా వెళ్తున్నప్పుడు.. వాటిలోపలి గాలికి కూడా అదే స్థిరమైన వేగం ఉంటుంది. గాలి మాత్రమే కాదు.. లోపలున్న మనుషులు, వస్తువులు, పురుగులకు కూడా అదే వేగం ఉంటుంది. అందువల్ల అవి ఈగలు, దోమలూ స్వేచ్ఛగా ఎగరగలుగుతాయి.


రైలులో ఉన్నవారికి.. ఈగలు... రైలు వేగంతో ఎగురుతునట్లు అనిపించదు. అవి మామూలు వేగంతో ఎగురుతున్నట్లే అనిపిస్తుంది. కానీ బయటి నుంచి చూసేవారికి ఈ తేడా తెలుస్తుంది. కదిలే రైలును ఎవరైనా బయటి నుంచి చూస్తే.. వారు... రైలుతోపాటూ.. లోపలి మనుషులు, వస్తువులు, కీటకాలు కూడా అదే వేగంతో వెళ్తున్న అనుభూతిని పొందగలరు.


ఒక బంతి ద్వారా కూడా ఈ ప్రయోగం చేసి చూడవచ్చు. బయట ఎక్కడైనా బంతిని ఎగరేస్తే, అది తిరిగి మన చేతిలో పడుతుంది. ఇదే విధంగా కదిలే రైలులో చేస్తే.. బంతి గాలిలోకి ఎగిరి, తిరిగి వెనక్కి వచ్చేసరికి.. రైలు కొంత ముందుకి వెళ్తుంది కాబట్టి.. ఆ బంతి.. చేతిలో పడకుండా, వెనక్కి పడాలి. కానీ అలా జరగదు. అది చేతిలోనే పడుతుంది. ఎందుకంటే.. ఆ బంతి కూడా.. రైలు వేగంతో ముందుకి వెళ్తుంది కాబట్టే.


ఇదంతా డోర్లు మూసివేసినప్పుడు మాత్రమే. డోర్స్ ఓపెన్ చేస్తే, బయటి గాలి లోపలికి వస్తుంది. దాంతో లోపలున్న గాలి స్థిరమైన వేగంలో మార్పులొస్తాయి. అందువల్ల పురుగులు స్థిరమైన వేగంతో ఎగరలేవు. ఎగరేసిన బంతి కూడా, తిరిగి స్థిరంగా చేతిలో పడే అవకాశాలు తక్కువ.


5, మార్చి 2024, మంగళవారం

How does a diamond shine? - బొగ్గు నుంచి వచ్చే వజ్రం ఎలా మెరుస్తుంది?


వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది అంటారు.. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అంటారు.. ఎందుకంటే డైమండ్ అత్యంత కఠినమైనది. ఐతే, ఈ వజ్రం బొగ్గు నుంచి వస్తుంది. బొగ్గు కఠినంగా ఉండదు. మరి డైమండ్ ఎందుకు ఉంటుంది? అసలు నల్లటి బొగ్గు నుంచి తెల్లటి వజ్రం ఎలా వస్తుంది? దానికి ఆ మెరుపులు ఎలా వస్తాయి? ఇలా ఎన్నో ప్రశ్నలు డైమండ్స్ చుట్టూ ఉంటాయి.


బొగ్గు మూడు రూపాల్లో ఉంటుంది. సాధారణ బొగ్గు, గ్రాఫైట్, డైమండ్. సాధారణ బొగ్గు, గ్రాఫైట్ చూడటానికి నల్లగానే ఉంటాయి. రెండూ కఠినంగా ఉండవు. మరి వజ్రాలు ఎందుకు పూర్తి విరుద్ధంగా ఉంటాయి? దీని వెనక బలమైన కారణం ఉంది.

 

సైంటిస్టుల ప్రకారం.. లక్షల సంవత్సరాల కిందట భూమి చల్లబడిన తర్వాత.. శిలాద్రవం భూమిలోపలి పొరల్లో వుండిపోయింది. కాలక్రమంలో ఉష్ణోగ్రత, ఇతర ఖనిజాల ఒత్తిడి వల్ల.. బొగ్గు మూలకాలు ఒకదానికొకటి అత్యంత దగ్గరకు చేరి, స్పటిక ఆకారాల్లోకి మారాయి. అవి స్వచ్ఛమైన కార్బన్ స్పటికలు. అవే వజ్రాలు. అలా అవి మారడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది.


వజ్రాలు గట్టిగా, కఠినంగా ఎలా మారుతున్నాయి అన్నదానికి మనం స్పాంజీని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. స్పాంజీని నొక్కితే.. చిన్నగా అవుతుంది. ఇంకా నొక్కితే మరింత చిన్నగా అవుతుంది. అలా నొక్కుతూ పోతే.. అది చిన్నగా అవుతూ, అవుతూ.. బాగా కుచించుకుపోతుంది. ఇక చిన్నగా అవ్వలేనంతగా నొక్కితే, అప్పుడు అది గట్టిగా అవుతుంది. ఇక దాన్ని నొక్కడానికి వీలవ్వదు. కొన్ని లక్షల సంవత్సరాలు ఇలా నొక్కుతూనే ఉంటే, మెత్తని స్పాంజీ కాస్తా.. గట్టి రాయిలా అయిపోతుంది. వజ్రం విషయంలోనూ ఇదే జరుగుతోంది. 


ఇక వజ్రానికి మెరుపు ఎలా వస్తుందంటే.. సాధారణంగా కార్బన్ స్పటికలకు మెరుపు అంతగా ఉండదు. వజ్రాల తయారీ నిపుణులు.. భూమిలో దొరికిన వజ్రాన్ని రెండుగా కోస్తారు. ఆ రెండు ముక్కలనూ.. రెండు వజ్రాల లాగా సానపడతారు. ఆ సమయంలో వజ్రాలకు కోణాలను ఏర్పరుస్తారు. కాంతి ఈ కోణాలపై పడినప్పుడు.. బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా వేర్వేరు కోణాల దగ్గర కాంతి ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతూ.. ఒక కోణం కాంతి, మరో కోణంపై ప్రసరిస్తూ, కోణాలన్నీ మెరుస్తూ, వజ్రం మెరుస్తున్నట్లు కనిపిస్తుంది.  


4, మార్చి 2024, సోమవారం

Does the wind leave the earth? - భూమిని వదిలి గాలి వెళ్లిపోతుందా?

 


గాలి లేని భూమిని ఊహించగలమా? కష్టం.. ఈ భూమిపై జీవం ఉండటానికి ప్రధాన కారణం గాలి. మనందరికీ ప్రతీ క్షణం గాలి కావాలి. మరి ఈ గాలి.. భూమిని వదిలి వెళ్లిపోతుందా? అలాంటి అవకాశం ఉందా?


భూమిపై వేడి, రాత్రిళ్లు అంతరిక్షంలోకి వెళ్లిపోతుంది. మేఘాలు కూడా ఆకాశంలోకి వెళ్తాయి. మరి గాలి ఎందుకు వెళ్లదు? ఎందుకంటే గాలి బరువుగా ఉంటుంది కాబట్టే. జనరల్‌గా మనం గాలికి బరువు ఉండదు అనుకుంటాం. నిజానికి గాలికి కూడా బరువు ఉంటుంది. భూమి ఉపరితలంపై ఒక క్యూబిక్ మీటర్ ప్రదేశంలో గాలి బరువు 1కేజీ 300 గ్రాములు ఉంటుంది. అంటే మన దగ్గర ఒక క్యూబిక్ మీటర్ అట్టపెట్టె ఉంటే.. అది ఖాళీగా ఉన్నా, అందులో గాలికి బరువు ఉన్నట్లే. ఐతే.. ఈ గాలి అన్ని ప్రదేశాల్లో ఒకే బరువుతో ఉండదు. అంటే.. భూమి ఉపరితలంపై ఎక్కువ బరువు, ఆకాశంలోకి వెళ్లే కొద్దీ తక్కువ బరువుతో ఉంటుంది.


ప్రత్యేక కారణాల వల్ల.. ఎక్కువ బరువు ఉన్న గాలి.. తక్కువ బరువు ఉన్న గాలి వైపు వెళ్తుంది. అందువల్ల మనకు తరచూ గాలి కదులుతున్న, వీస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇలా గాలి కదలడం వల్లే మనకు సుడిగాలులు, తుఫాన్ల వంటివి వస్తుంటాయి. 


భూమికి ఉండే గురుత్వాకర్షణ శక్తి, బరువైన వాటిని తనవైపు లాక్కుంటుంది. గాలి బరువు కంటే, భూమి బరువు ఎక్కువ. అందువల్ల గాలిని నిరంతరం గురుత్వాకర్షణ శక్తి లాగుతూనే ఉంటుంది. ఈ కారణంగానే గాలి భూమితోనే ఉంటోంది. భూమికి గ్రావిటీ పవర్ లేకపోతే, గాలి ఎప్పుడో విశ్వంలోకి వెళ్లిపోయేది. భూమి భూమిలా ఉన్నంతకాలం, గ్రావిటీ పవర్ తగ్గనంతకాలం గాలి ఉంటుంది.


ఇంతకీ ఈ గాలి ఎంతవరకూ ఉందో తెలుసా? భూమి ఉపరితలం నుంచి సుమారు 30 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉంది. ఈ గాలిలో బరువైన గాలి.. మొదటి 10 కిలోమీటర్లలోనే ఉంది. అంటే, మొత్తం గాలిలో 75 శాతం గాలి.. 10 కిలోమీటర్ల ఎత్తులోనే ఉంది. మిగతా 20 కిలోమీటర్ల ఎత్తులో 25 శాతం గాలి ఉంది. 


చందమామపై ఎయిర్ ఎందుకు లేదు అనేది మరో ప్రశ్న. చందమామపై ఉండే గ్రావిటీ.. గాలిని లాక్కునేంత బలంగా లేదు. అందువల్ల అక్కడ గాలి లేదు. 


3, మార్చి 2024, ఆదివారం

Why we cannot hear sounds of Sun - సూర్యుడి పేలుళ్ల శబ్దాలు మనకు ఎందుకు వినిపించవు?

 


మన చుట్టుపక్కల ఎవరైనా క్రేకర్స్ కాల్చితే.. ఆ శబ్దాలు మనకు తీవ్రంగా వినిపిస్తాయి. అలాగే ఎక్కడో కిలోమీటర్ల అవతల ట్రైన్ కూత పెడితే.. అది కూడా మనకు వినిపిస్తుంది. ఇలా రకరకాల ధ్వనులను మనం వింటూ ఉంటాం. మరి అంతరిక్షంలో సూర్యుడిపై క్షణక్షణం భారీ పేలుళ్లు జరుగుతూ ఉంటాయి. ఆ శబ్దాలు మనకు ఎందుకు వినిపించవు?


మన సౌర కుటుంబంలో సూర్యుడు కేంద్రం. మన భూమి, ప్రాణికోటి మనుగడకు సూర్యుడే ఆధారం. సూర్యుడిలో ప్రధానంగా ఉండేది రెండే వాయువులు. ఒకటి హైడ్రోజన్, రెండు హీలియం. హైడ్రోజన్ సుమారు 75 శాతం ఉండగా.. మిగతాది హీలియం ఉంటుంది. కేంద్రక సంలీన చర్య వల్ల, ప్రతి సెకనుకూ సుమారు 60 వేల టన్నుల హైడ్రోజన్‌ పరమాణువులు, హీలియం పరమాణువులుగా మారుతాయి. ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంత సూత్రమైన E = mc2 ప్రకారం, 60వేల టన్నుల హైడ్రోజన్.. హీలియంగా మారినప్పుడు, దాదాపు 420 టన్నుల ద్రవ్యరాశి, శక్తిగా మారుతుంది. దాన్నే మనం సోలార్ పవర్‌గా చెబుతాం. మరి ఒక్క సెకన్‌లోనే అంత ఎనర్జీ వస్తే, ఎంత పెద్ద పేలుళ్లు జరిగివుండాలి? మరి మనకు ఆ శబ్దాలు ఎందుకు వినిపించవు?


సూర్య గోళం ఏడు లక్షల కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంటుంది. సూర్యుడిలో 10 లక్షల భూములు పట్టగలవు. ఐతే.. సూర్యుడిలో కేంద్రక సంలీన చర్య.. పై భాగంలో జరగదు. అంతర్భాగంలో 2లక్షల కిలోమీటర్లలోపే జరుగుతుంది. ఆ తర్వాత పుట్టే ఎనర్జీ లక్షల కిలోమీటర్లు ప్రయాణించి, ఉపరితలానికి చేరుతుంది. అది చాలా వేడిగా.. ఉడుకుతూ ఉంటుంది. అక్కడ వేడి దాదాపు 5,600 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అంత వేడి ఎనర్జీ ఉందంటే.. లోపల ఎంత పెద్ద పేలుళ్లు జరుగుతాయో ఊహకందదు. భూమి బద్ధలైనట్లుగా భారీ శబ్దాలు వస్తుంటాయి. వాటిని వినడం మనవల్ల కాదు. 


లక్కీగా సూర్యుడి పేలుళ్ల శబ్దాలు భూమి వరకూ రావు. ఎందుకంటే సూర్యుడు మనకు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అంతరిక్షం అంతా శూన్యమే. శూన్యంలో కాంతి ప్రసరిస్తుంది గానీ, శబ్దం ప్రయాణించలేదు. అందువల్ల సూర్యుడి శబ్దాలు శూన్యంలో ప్రయాణించి, మన భూమికి రాలేవు. అందుకే అంతరిక్షంలో వ్యోమగాములు గట్టిగా అరిచినా, పక్కనే ఉన్నవాళ్లకు కూడా వినిపించదు.

9, ఆగస్టు 2021, సోమవారం

Video: భలే ఉంది కదా... దీన్ని ముట్టుకుంటే ఏమవుతుందో తెలుసా?

కొక్కా (image credit - twitter)

Viral Video: సోషల్ మీడియా అద్భుతమైనది. కొత్త విషయాలు, ఆసక్తికరమైన సంగతులు తెలుసుకోవాలి అనుకునేవారికి సోషల్ మీడియాను మించినది ఉండదేమో. ఐతే... అదే సోషల్ మీడియాలో అసత్యాలు కూడా చాలా ఉంటాయనుకోండి. సరే... మనం అసలు టాపిక్‌కి వద్దాం. ఆ జంతువు పేరు కొక్కా (quokka). పలకడం కష్టమే. చిన్న తోకతో... పిల్లి అంత సైజులోనే ఉంటుంది. ఆస్ట్రేలియాలో కంగారూలు, వల్లబీలతోపాటూ... ఈ జంతువులూ ఉంటాయి. కానీ ఇవి అంతగా కనిపించవు. ఇవి శాఖాహార (herbivorous) జీవులు. రాత్రిపూట (nocturnal) తిరిగేవి. అందువల్ల పగటి వేళ ఈ జంతువులు అరుదుగా కనిపిస్తాయి.

తాజాగా ఓ కొక్కా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఓ మహిళ... జూలోని కొక్కాకు బొప్పాయి ముక్క లాంటిది ఇచ్చింది. ఆ ముక్కను తింటూ కొక్కా ఎంతో ఆనందపడింది. తన జీవితంలో ఇదే అత్యంత సంతోషకరమైన సమయం అన్నంత ఆనందం దాని ముఖంలో కనిపిస్తోంది. అలా అది తింటూ... ఓ సందర్భంలో... ఆ మహిళకు థాంక్స్ చెబుతూ... ఆమెను టచ్ చెయ్యబోయింది. కానీ ఆ మహిళ కాస్త వెనక్కి జరిగింది. మొత్తంగా కొక్కాను ఆమె అస్సలు ముట్టుకోలేదు.

నిజానికి అంత కలివిడిగా ఉండే జంతువును ఎవరైనా అలా ముట్టుకొని... నిమురుతారు. కానీ ఆమె టచ్ చెయ్యకపోవడానికి ప్రత్యేక కారణం ఉంది. ఈ కొక్కాలను ముట్టుకున్నా... వీటికి ఆహారం పెట్టినా ఆస్ట్రేలియాలో ఫైన్ వేస్తారు. ఆ ఫైన్ రూ.8వేల నుంచి రూ.5 లక్షల దాకా ఉంటుంది. అక్కడి అధికారులు జాలిపడి వదిలేయరు. కచ్చితంగా ఫైన్ వేసేస్తారు. అందుకే అక్కడ ఎవ్వరూ కొక్కాల జోలికి వెళ్లరు.

ఆ వీడియోని ఇక్కడ చూడండి.



పశ్చిమ ఆస్ట్రేలియాలో ఓ చిన్న ప్రాంతంలోనే ఈ జంతువులు జీవిస్తున్నాయి. ఇవి అంతరించే జంతువుల జాబితాలో చేరాయి. అందువల్ల వీటిని రక్షించే విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం రాజీ పడట్లేదు.



ఈ వీడియోలో చూడండి... ఈ అమ్మాయి కొక్కాను ముట్టుకోవడమే కాదు... ఆహారం కూడా పెట్టగలదు. ఎందుకంటే... ఆమె ప్రభుత్వ పర్యావరణ పరిరక్షణ ఉద్యోగి.



మన దేశంలో కూడా చాలా జంతువులు, పక్షులు అంతరించే దశలో ఉన్నాయి. పునుగు పిల్లి, మూషిక జింకల వంటివి చూద్దామన్నా కనిపించట్లేదు. అలాంటి వాటిని రక్షించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటున్నారు నెటిజన్లు. 

8, ఆగస్టు 2021, ఆదివారం

B House: అరుదైన ఇల్లు... ఇండియాలో అలాంటిది అది ఒక్కటే..!

Symbolic Image - Not real one

B House: ఇండియాలో 140 కోట్ల ఉంది జనాభా. కోట్ల ఇళ్లు ఉన్నాయి. కానీ ఆ ఇల్లు ప్రత్యేకమైనది. అది ఏ ప్రధాని ఇల్లో, రాష్ట్రపతి భవనమో కాదు. ఓ సాదాసీదా ఇల్లు. మరెందుకు అది ప్రత్యేకమైనదో చూద్దాం.

భారత్-బంగ్లాదేశ్ మధ్య... సరిహద్దు అనగానే చెక్ పోస్టులు, కంచెలు, రెండు దేశాల ఆర్మీ ఇవన్నీ ఉంటాయి. కానీ ఓ ఇల్లు సరిగ్గా సరిహద్దులో ఉంది. ఆ ఇంటి మధ్య నుంచే బోర్డర్ గీత వెళ్లింది. అందువల్ల ఆ ఇంటి వరకూ... ఫెన్సింగ్ లేదు. అంటే 385 గజాల స్థలానికి కంచె లేదు. ఆ స్థలమే ఆ ఇల్లు. ఆ ఇంటికి ఒకవైపు భారత్, మరోవైపు బంగ్లాదేశ్ ఉంది. అందువల్ల ఆ ఇంట్లో రెండు దేశాల వారూ ఉంటారు. వారి మధ్య ఏ గొడవలూ ఉండవు. పూర్తి స్నేహపూర్వకంగా ఉంటారు. అసలు వాళ్లకు బోర్డర్ ఆలోచనే ఉండదు. కానీ ఆ ఇల్లు సగం ఇండియాది, సగం బంగ్లాదేశ్‌ది.

భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న సరిహద్దులో ఈ ఇల్లు ఉన్న ప్రదేశాన్ని జీరో లైన్ అంటారు. ఆ ఇంటికి రెండు వైపులా... సరిహద్దు అంతా ఫెన్సింగ్‌తో ఉంటుంది. ఇంట్లోంచీ ఓ గీత లాంటిది వెళ్లినట్లుగా గుర్తు ఉంటుంది. ఆ గుర్తే సరిహద్దు. ఈ ఇల్లు... బెంగాల్‌లోని హరి పుకుర్ (Hari pukur)లో సరిహద్దులో ఉంది. ఈ ఇంట్లో గోడకు... ఓవైపు ఇండియా అనీ, మరోవైపు బంగ్లాదేశ్ అని రాసి ఉంటుంది. 

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ఇల్లు (Image credit - ANI)

ఇంట్లో ఉన్నవారు... కలిసి పండుగలు చేసుకుంటారు. కలిసిమెలిసి ఉంటారు. కానీ వాళ్లను చూసినప్పుడు ఎవరు భారతీయులో, ఎవరు బంగ్లాదేశీయులో ఈజీగా గుర్తుపట్టేయవచ్చు. ఆ ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతతే ఉంటుంది. ఈ సరిహద్దు టెన్షన్లు ఉండవు. కానీ ఇంటి బయట మాత్రం మిగతా సరిహద్దులో లాగే... సెక్యూరిటీ ఉంటుంది. ఆ ఇంటిని కూడా రెండు దేశాల ఆర్మీ గమనిస్తూనే ఉంటుంది. ఇండియావైపున బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) గమనిస్తూ ఉంటుంది. బంగ్లాదేశ్ వైపున బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ (Border Guards Bangladesh (BGB)) సైన్యం ఉంటుంది.

ఇండియా-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఎప్పుడూ ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి. ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అలా ఉండదు. చాలా వరకూ ప్రశాంత వాతావరణమే ఉంటుంది. అందువల్ల ఆ ఇంటి చుట్టుపక్కల రెండు దేశాల సైన్యమూ రోజూ లాగే కలుసుకుంటూ... ప్రశాంతంగా ఉంటారు.

"ఆ ఇంటికి ఫెన్స్ లేదని మేం ఎప్పుడూ ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఇండియాతో ఎప్పుడూ మాకు సత్సంబంధాలే ఉన్నాయి" అని 2019లో BGB మేజర్ నయీమ్ కమాండర్ ANIకి తెలిపారు.

"చెప్పాలంటే... ఇక్కడ ఆలయాలు, మసీదుల దగ్గర ఎలాంటి సరిహద్దు రేఖలూ లేవు. అలాగని ప్రజలు ఫ్రీగా తిరిగే అవకాశమూ లేదు. ఇక్కడ 24 గంటలూ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి... ప్రజలు కూడా కొన్ని రూల్స్ పాటించాలి. బంగ్లాదేశీయులు, భారతీయులూ కలిసి నమాజు చేసుకోవడానికి ప్రత్యేక మసీదు ఉంది. అక్కడ ఏదైనా పండుగ, వేడుకలు జరపాలి అనుకుంటే... రెండు దేశాల భద్రతా దళాలు ముందుగానే మాట్లాడుకుంటాయి" అని BSF కమాండర్ బీఎస్ నేగీ... ANIకి తెలిపారు.

ఇలా సరిహద్దులో ఇల్లు ఉండటం... ఆ ఇంట్లోంచే సరిహద్దు గీత వెళ్లడం... ఆ ఇంట్లోనే రెండు దేశాల ప్రజలూ హాయిగా నివసిస్తుండటంతో... ఇండియాలోనే ఇదో ప్రత్యేక ఇల్లుగా ఉందనుకోవచ్చు.


1, ఆగస్టు 2021, ఆదివారం

NASA: మనం ఎప్పుడూ చూడని చిత్రం... 3 గెలాక్సీల యుద్ధం

3 గెలాక్సీల యుద్ధం (Image credit: ESA/Hubble & NASA, J. Dalcanton)

NASA: మన పాలపుంత (Milkyway) గెలాక్సీలో... కొన్ని కోట్ల నక్షత్రాలున్నాయి. వాటిలో జస్ట్ 10 పర్సెంట్ నక్షత్రాల్ని మాత్రమే మనం చూస్తున్నామేమో. మన గెలాక్సీ గురించే మనకు పూర్తిగా తెలియదు. అలాంటి ఈ అనంతవిశ్వంలో ఎన్నో అద్భుతాలు జరిగిపోతున్నాయి. అలాంటి వాటిని మనకు చూపిస్తున్న హబుల్ స్పేస్ టెలిస్కోప్... మరో అత్యంత అరుదైన దృశ్యాన్ని చూపించింది. ఒకేలా ఉన్న మూడు పాలపుంతలు (3 galaxies) కొట్టేసుకుంటున్న దృశ్యాన్ని చూపించింది.

అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ - నాసా (NASA), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) కలిసి ఈ దృశ్యాన్ని అభివృద్ధి చేశాయి. ఇందులో మూడు పాల పుంతలు.. మూడు గురుత్వాకర్షణలతో కొట్టేసుకుంటున్నాయి. ఒకదాన్ని మరొకటి లాగేసుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను ఆర్ప్ 195 (arp 195) అని పిలుస్తారు. అత్యంత అసాధారణ, విచిత్రమైన గెలాక్సీల వ్యవస్థలను ఆర్ప్ 195 అని పిలుస్తారు. ఇలాంటి గెలాక్సీలు మన విశ్వంలో అక్కడక్కడా ఉన్నాయి. ఇవి ఎప్పుడూ అంతుచిక్కని విధంగా, మిస్టరీగా, ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. 

3 గెలాక్సీల యుద్ధం (Image credit: ESA/Hubble & NASA, J. Dalcanton)


హబుల్ టెలిస్కోపుతో పనిచేసే వ్యోమగాములు (Astronomers)... ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకో తెలుసా... ఆ ఒక్క సెకండ్‌లోనే హబుల్ టెలిస్కోప్ చూపించే ఏదైనా అద్భుత దృశ్యం మిస్ కావచ్చు. ప్రత్యేక కంప్యూటర్ ఆల్గారిథమ్ ద్వారా... హబుల్ శోధనలను... వ్యోమగాములు పరిశోధిస్తూ ఉంటారు. కొన్ని అరుదైన సందర్భాల్లో హబుల్ టెలిస్కోప్ నుంచి పైన కనిపించే అత్యంత అరుదైన దృశ్యాలు లభిస్తాయి.

హబుల్ తనపాటికి తాను ఈ దృశ్యాన్ని చూపించేసింది. కానీ ఇప్పుడు అసలు పని వ్యోమగాములకు మొదలైంది. ఇక ఆ కొట్టుకునే మూడు గెలాక్సీలను పరిశోధిస్తూ... ఆ యుద్ధంలో ఏం జరుగుతుందో పరిశీలించే పని రోదశీ శాస్త్రవేత్తలది. ఇలాటివి గమనించేందుకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ రెడీ చేస్తున్నారు. త్వరలోనే అది అందుబాటులోకి వస్తుంది.